హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఏటా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పిన కాంగ్రెస్పై నిరుద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జూలై 15న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్లో భారీ నిరుద్యోగ రణభేరి నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 33జిల్లాల నుంచి 30 లక్షల మంది ఈ ధర్నాకు హాజరవ్వాలని నిరుద్యోగ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
కాంగ్రెస్ అధికారం చేపట్టి 31 నెలలు గడుస్తున్నా ఒక్క భారీ నోటిఫికేషన్ ఇవ్వలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ల పోస్టుల భర్తీ మినహా కాంగ్రెస్ ఇప్పటివరకు చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే రణభేరికి పిలుపునిచ్చినట్టు నిరుద్యోగ జేఏసీ ప్రకటించింది. నిరుద్యోగ యువత, విద్యార్థులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
1)ఉద్యోగ విరమణ వయస్సు: ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును సవరించి తిరిగి 58 ఏండ్లకు కుదించాలి.
2) పోలీస్, సీసీఎల్ఏ ఉద్యోగాల పెంపు: సీసీఎల్ఏ ద్వారా 5,944 జీపీవో పోస్టులను భర్తీ చేయడంతో పాటు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించిన 7,437 పోస్టులను 20వేలకు పెంచి భర్తీ చేయాలి.
3) మెగా డీఎస్సీ, అటవీ శాఖ పోస్టులు: రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి. 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఖాళీలతో పాటు అ న్ని శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి.
4) టీజీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ద్వారా గ్రూప్-1లో 500, గ్రూప్-2లో 1,000, గ్రూప్-3లో 3వేలు, గ్రూప్-4లో ఖాళీగా ఉన్న పది వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలి
5) జీవో 46 రద్దు, వయోపరిమితి పెంపు: జీవో 46ను రద్దు చేయాలి. సుదీర్ఘ కాలం గా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి వ యస్సు పైబడిన అభ్యర్థుల కోసం పోలీస్ ఉద్యోగాల్లో వయోపరిమితిని పెంచాలి.
6) నిరుద్యోగ భృతి: డిగ్రీ చదివి ఉద్యోగం లేని ప్రతి నిరుద్యోగికీ, ఉద్యోగం సాధించే వరకు ప్రభుత్వం నెలకు రూ.5,016 చొప్పున నిరుద్యోగ భృతిని చెల్లించాలి.
7) బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
8) యూపీఎస్సీ తరహాలో ప్రక్షాళన: పేపర్ లీకేజీలు, అవకతవకలకు తావులేకుండా ఉండేందుకు.. ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చి టీజీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చే యాలి. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో పూర్తి పారదర్శకంగా ఉండాలి.