కామారెడ్డిలో సీఎం కేసీఆర్కు భారీ మద్దతు లభిస్తున్నది. ప్రజలంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి స్వచ్ఛందంగా, సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నారు. మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లో శనివారం నిర్వహించిన ఏకగ్రీవ మద్దతు ప్రదర్శనలలో గిరిజనులంతా కలిసి ‘జై కేసీఆర్’ అని నినదించారు. ప్రజల నుంచి స్పందన పెరుగుతుండటంతో ప్రతిపక్ష పార్టీల్లో జంకు మొదలైంది. ఎన్నికలు సమీపించే సమయానికి పోరు ఏకపక్షంగా మారే అవకాశం ఉండటంతో ప్రత్యర్థిపార్టీల్లో వణుకు పుడుతున్నది.
CM KCR | నిజామాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘కారే రావాలి.. కేసీఆరే కావాలి’ అంటూ కామారెడ్డి నియోజకవర్గం నినదిస్తున్నది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్తోపాటు తాను కామారెడ్డి నుంచి పోటీచేస్తున్నట్టు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన నాటినుంచీ ఆయనకు ప్రజా మద్దతు వెల్లివిరిస్తున్నది. సాక్షాత్తు ఉద్యమ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తమ గడ్డ నుంచి బరిలో నిలుస్తుండటంతో కామారెడ్డి ప్రజలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఉద్యమ నేత వెంటే నడుస్తామని ఊర్లన్నీ ముక్తకంఠంతో నినదిస్తున్నాయి. ముఖ్యమంత్రికి మద్దతు తెలుపుతూ మొన్న కామారెడ్డి మండలం గర్గుల్లో పలు కుల సంఘాలు ఏకగ్రీవ తీర్మానం చేయగా, అదే స్ఫూర్తితో అనేక గ్రామాలు వరుసకట్టి కేసీఆర్కు జై కొడుతున్నాయి. తెలంగాణ సాధించిన గులాబీ బాస్ను వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజలంతా ప్రతినబూనుతున్నారు. తాజాగా మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు శనివారం స్వచ్ఛందంగా ర్యాలీలు తీశారు. ‘జై కేసీఆర్’, ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మరో అడుగు ముందుకేసి కేసీఆర్ ఎన్నికల ఖర్చు కోసం ప్రజలే చందాలు జమ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తప్ప ఇతర ఏ పార్టీకీ ఓటెయ్యబోమని స్పష్టం చేస్తున్నారు.
నాడు ఉద్యమంలో.. నేడు స్వరాష్ట్రంలో..
తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిన తొలినాళ్లలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రజల నుంచి వచ్చిన స్పందన అంతాఇంతా కాదు. కేసీఆర్ అడుగులో అడుగై సమైక్య పాలకులకు వ్యతిరేకంగా స్వరాష్ట్రం కోసం పెద్ద ఎత్తున పోరు చేసిన చరిత్ర ఈ గడ్డకు ఉన్నది. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఆవిర్భావం తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచారెడ్డి మండలం చరిత్రకెక్కింది. అప్పటి నిజామాబాద్ జిల్లాలో ఏకగ్రీవంగా మాచారెడ్డి మండల పరిషత్తు స్థానాన్ని గులాబీ పార్టీ కైవసం చేసుకోవడం సంచలనంగా మారింది. ఇప్పుడదే మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల ప్రజలు మళ్లీ కేసీఆర్కు జై కొడుతూ స్వచ్ఛంద తీర్మానాలతో ఉద్యమ స్ఫూర్తిని చాటి చెబుతుండటం విపక్షాలకు దడ పుట్టిస్తున్నది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్వస్థలం కూడా మాచారెడ్డి మండల కేం ద్రమే కావడం విశేషం. షబ్బీర్కు వ్యతిరేకంగా, కేసీఆర్కు అనూకూలంగా ఆయన సొంత మండలంలోనే జోరుగా తీర్మానాలు చేస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ ఆగమవుతున్నది. మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట, నడిమితండా, వెనుకతండా, బోడగుట్ట తండా, అంకిరెడ్డిపల్లి తండా, రాజ్ఖాన్ తండా, మైసమ్మ చెరువు తండా, గుంటి తండా, వడ్డెర గూడెం తండా గ్రామ పంచాయతీల్లో ప్రజలంతా కలిసి సీఎం కేసీఆర్కే ఓటేస్తామని తీర్మానించారు. ఎన్నికల నామినేషన్ ఖర్చులకు ఒక్కో గ్రామ పంచాయతీ నుంచి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.90 వేలు జమ చేసి కేసీఆర్కు అందించాలని నిర్ణయించారు. పాల్వంచ మండలం (పాత మాచారెడ్డి)లోని మంథని దేవునిపల్లిలో ప్రజలు ఏకంగా రూ.25 వేలు జమ చేసి కేసీఆర్కు అందిస్తున్నట్టు ప్రకటించారు. మొత్తం రూ.1.15 లక్షలు జమ చేసిన డబ్బులను గులాబీ దళపతికి అందివ్వనున్నారు.
కేసీఆర్కు జైకొట్టిన గిరిజనం
కామారెడ్డిలో సీఎం కేసీఆర్కు భారీ మద్దతు లభిస్తున్నది. ప్రజలంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి స్వచ్ఛందంగా, సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నారు. మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లో శనివారం నిర్వహించిన ఏకగ్రీవ మద్దతు ప్రదర్శనలలో గిరిజనులంతా కలిసి ‘జై కేసీఆర్’ అంటూ నినదించారు. మొత్తం పది గ్రామ పంచాయతీల్లో కేసీఆర్కు మద్దతుగా తీర్మానాలు జరిగితే.. అందులో 9 తండాలే ఉండటం విశేషం. సీఎం కేసీఆర్ పరిపాలనలోనే తండాలన్నీ పంచాయతీలుగా రూపాంతరం చెందాయి. దీంతో వారంతా కేసీఆర్పై విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ మద్దతు తెలుపుతున్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్పై ఉన్న అభిమానం మేరకే ఇదంతా చేస్తున్నట్టు కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీకి అన్ని వర్గాల నుంచి వస్తున్న మద్దతు నేపథ్యంలో గులాబీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తున్నది. ప్రజల నుంచి స్పందన పెరుగుతుండటంతో ప్రతిపక్ష పార్టీల్లో జంకు మొదలైంది. ఎన్నికలు సమీపించే సమయానికి పోరు ఏకపక్షంగా మారే అవకాశం ఉండడంతో వారిలో వణుకు పుడుతున్నది. బీజేపీ పార్టీలో దయనీయ దుస్థితి కనిపిస్తున్నది. ధైర్యంగా ఎదుర్కొనే దమ్ములేక బీఆర్ఎస్ పార్టీపై సోషల్ మీడియాలో కమలదళం దుష్ప్రచారాన్ని మొదలుపెట్టింది. అయితే, బీఆర్ఎస్ శ్రేణులు సైతం అదే స్థాయిలో తిప్పికొడుతూ.. బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
పోటీకి ప్రతిపక్షాల గుబులు
కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతో ప్రతిపక్ష నేతలకు గుబులు పట్టుకున్నది. కేసీఆర్కు ఓ వైపు ప్రజల నుంచి స్వచ్ఛందంగా వస్తున్న మద్ద తు, మరోవైపు ఎన్నికల్లో కేసీఆర్ గెలుపు ఖా యమన్న సంకేతాల నేపథ్యంలో బీజేపీ, కాం గ్రెస్ నేతలు డైలమాలో పడ్డారు. పోటీ చేయడమా? విరమించుకోవడమా? అని తర్జనభర్జన పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి షబ్బీర్ అలీ పోటీ చేస్తుండటం ఖాయమైంది. పీసీసీ ఆహ్వానించిన దరఖాస్తుల స్వీకరణలో కామారెడ్డి నియోజకవర్గం నుంచి షబ్బీర్ మాత్రమే దరఖాస్తు చేశారు. కేసీఆర్ ప్రకటనకు మునుపు చాలా మంది ఆశావహులు కామారెడ్డి బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపారు. షబ్బీర్కు వ్యతిరేకంగా పావులు కదిపారు. తీరా కేసీఆర్ రాకతో వారంతా వెనక్కి తగ్గారు. షబ్బీర్ను ముందుకు నెట్టి తెర వెనుక బీఆర్ఎస్కు మద్దతు తెలియజేయాలన్న ఆలోచనకు వస్తున్నట్టు తెలుస్తున్నది. షబ్బీర్ అలీ హయాంలో కామారెడ్డిలో ఏ మాత్రం అభివృద్ధి జరుగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులకు అంటకాగిన షబ్బీర్ అలీ ఏనాడూ స్థానిక ప్రజల గు రించి ఆలోచన చేయలేదని కాంగ్రెస్ శ్రేణులే పేర్కొంటున్నాయి. కేసీఆర్కు మద్దతు తెలప డం ద్వారా కామారెడ్డి ఎనలేని అభివృద్ధి చెందుతుందని స్థానికులు నమ్మకంతో చెప్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ తన పరువును నిలుపుకొనేందుకే దరఖాస్తు చేసినట్టుగా హస్తం పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
కేసీఆర్ పోటీ చేయడం మా అదృష్టం
కేసీఆర్ సారు కామారెడ్డి నుంచి పోటీ జేస్తానని చెప్పిన సంది చాలా సంతోషంగా ఉ న్నం. బీడీలు చేసుకునే మా లాంటోళ్లకు పింఛిన్ ఇచ్చింది కేసీఆర్ సారే. బీడీలు జేసుకుంట బతికే మాలాంటోళ్లకు అండగా నిలిచిన కేసీఆర్ సారు ఈడనుంచి పోటీ జేస్తుండటం మా అదృష్టం. మొత్తం ఓట్లన్నీ ఆయనకే పడ్తయ్. భారీ మెజార్టీతో సీఎం సారు గెలుస్తరు.
– గంగాపురం రేణుక, ఎల్లంపేట
అందరం కేసీఆర్ వెంటే
మాలాంటి ముసలోళ్లకు కేసీఆరే పెద్ద దిక్కైండు. అందరం కేసీఆర్ వెంటనే ఉన్నం. ఊరూ ఊరంతా ఇదే మాట. మా కాడి నుంచి పోటీ చేస్తానని తెల్వంగనే మస్తుగా సంబురవడ్డా. కేసీఆర్ సార్ అస్తే మాకు మరింత మేలైతది. సారుకు భారీగా ఓట్లేసి గెలిపించుకుంటం.
– బుద్ది ఎల్లవ్వ, ఎల్లంపేట గ్రామం
మాకు పోడు పట్టాలు ఇచ్చిన దేవుడు
ఏండ్ల సంది మేము దున్నుకుంటున్న పోడు భూములకు ఎవరూ పట్టాలియ్యలె. మాకు పట్టాలిచ్చిన దేవుడు కేసీఆర్. ఆయననే గెలిపించుకుంటం.
-మాలోత్ పూర్ణ, మాచారెడ్డి మండలం
నాటి ఉద్యమ స్ఫూర్తితోనే..
కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయాలని నిర్ణయించుకోవడం మా అదృష్టం. నాటి ఉద్యమ స్ఫూర్తితోనే గ్రామాలన్నీ ఆయనకు మద్దతుగా తీర్మానాలు చేస్తున్నాయి.
– లోయపల్లి నర్సింగరావు, ఎంపీపీ, మాచారెడ్డి