సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): పెద్దనోట్ల రద్దు డీమానిటైజేషన్ సమయంలో జరిగిన భారీ అక్రమాల కేసులో సికింద్రాబాద్ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. 2017లో పాత కరెన్సీ నోట్లకు బదులుగా కొత్త నోట్లు ఇస్తామంటూ మోసాలకు పాల్పడిన 17 మంది ముఠాపై బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో పాతనోట్లను మార్చేందుకు అక్రమంగా రూ.1.20 కోట్ల విలువైన కరెన్సీని బదిలీ చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించి చార్జీషీట్ దాఖలు చేశారు. కేసు విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం మొత్తం 11 మందిని దోషులుగా తేల్చింది. ఈ తీర్పులో ప్రధాన నిందితుడైన యాదగిరికి కోర్టు రూ.4.5కోట్ల భారీ జరిమానాతో పాటు మూడున్నర ఏండ్ల జైలుశిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఈ కేసులో ప్రమేయమున్న మిగతా పదిమంది దోషులకు రూ.60వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.