వరంగల్, జూలై 29 : వరంగల్ ప్రజల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న భద్రకాళీ అమ్మవారు శాకంబరీ అలంకరణలో బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయలు, పండ్లతో నిండుగా కొలువుదీరి ప్రకృతికి ప్రతీకగా సాక్షాత్కరించారు. శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఒక అలంకరణలో దర్శనమ్చిన భద్రకాళీ అమ్మవారు 15వ రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి( వ్యాస పౌర్ణమి) రోజు శాకంబరీగా దర్శనమిచ్చారు.
ప్రధాన అర్చకులు శేషు ఆధ్వర్యంలో ఉదయం 3 గంటలకు నిత్యాహ్నికం నిర్వహించిన అనంతరం అర్చకులు వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని ఆరు గంటలపాటు శాకంబరీగా అలంకరించారు. ఉదయం 9.30 గంటల నుంచి భద్రకాళీని దర్శంచుకునేందుకు భక్తులకు అనుమతించారు. గంటల తరబడి అమ్మవారి దర్శనం కోసం క్యూలో బారులు తీరారు. దాతల సహాయంతో ప్రసాద వితరణ చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈవో రామల సునీత పర్యవేక్షించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కాగా, భద్రకాళి శాకంబరీ, గురుపౌర్ణమి వేడుకలతో నగరమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భద్రకాళీతోపాటు సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు.