హాలియా/త్రిపురారం, ఆగస్టు 31: దళితబంధు ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్ అభివన అంబేద్కర్ అని, రాబోయే ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మాదిగల మద్దతు బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని మాదిగ నేతలు ప్రకటించారు. సాగర్ నియోజకవర్గంలోని హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డులో నల్లగొండ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు అధ్యక్షతన.. గురువారం జరిగిన మాదిగ ముఖ్య నాయకులు, కార్యకర్తల నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. అనంతరం పెద్దులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలకులు దళితులను అంటరానివారిగా చూశారు తప్ప.. తమ జీవితాల్లో వెలుగులు నింపిన దాఖలాలు లేవని విమర్శించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా దళితులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, దళితబంధు పథకం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. హైదరాబాద్లో బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం అభినందనీయమని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలోనే దళితులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుతూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సాగర్ నియోజకవర్గ అభ్యర్థి నోముల భగత్కు మాదిగల సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. అలాగే.. నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో బీసీ ఐక్యవేదిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీసీ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్ మాట్లాడుతూ.. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్న భగత్ను బీసీలమంతా ఐక్యంగా ఉండి గెలిపించుకుంటామని ప్రకటించారు