భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 13 (నమస్తేతెలంగాణ): ఒక కొడుకు, ఒక కూతురు.. ఉన్నంతలో సం పాదన. వ్యవసాయమే జీవనాధారం. ఇలా రోజులు గడుపుతున్న ఆ తండ్రి.. ముందు బిడ్డ పెండ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందనుకున్నాడు. అనుకున్నట్లుగానే మంచి సంబంధం చూసి బిడ్డను ఓ అయ్య చేతిలో పెట్టాడు. కూతురు తన భర్త పిల్లలతో సంతోషంగా ఉంటుంది. కొంతకాలం ఆగి కొడుకు పెండ్లిజేత్తామని అనుకున్నాడు. కుటుంబ బాధ్యతను కొడుకుకు అప్పగించాడు.
చదువుకున్న కొడుకు సాగులో సాయపడితే మంచి దిగుబడి ఉంటుందని భావించాడు. కొడుకుతో కలిసి తల్లిదండ్రులు వ్యవసాయంలో రెక్కలుముక్కలు చేసుకున్నారు. కొడుకు ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తూనే.. వచ్చిన జీతాన్ని కూడా పెట్టుబడికే పెట్టిండు. ఉన్న మూడెకరాలతో పాటు మరో 8 ఎకరాలు కౌలు తీసుకున్నారు. పంట గట్టిగ పండితే ఉన్న అప్పులన్నీ తీరుతాయనుకున్నరు. కానీ లెక్క తప్పింది. దిగుబడి పోయింది. అప్పులు మిగిలాయి. కుప్పగా పేరుకుపోయిన అప్పులు చివరికి కొడుకునే మింగేశాయి. ఆధారం అయితడనుకున్న కొడుకు దూరం కావడంతో కుటుంబమే ఆగమైపోయింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం యానంబైలు గ్రామానికి చెందిన మంత్రి శంకర్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరికి వారసత్వంగా వచ్చిన ఉమ్మడి ఆస్తి మూడెకరాలు ఉంది. ఇది కూడా మంత్రి శంకర్ చిన్నాన్న పేరు మీద ఉన్నది. ధరణిలో వచ్చిన సమస్య వల్ల ఇంకా పట్టా పేరు మార్పు కాలేదు. అసలే పేదకుంటుంబం. ఆపై కూతురు పెండ్లి చేసి కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఆర్థిక కష్టాలన్నీ గట్టెక్కేందుకు నేలతల్లిని నమ్ముకున్నారు. తల్లిదండ్రుల వయసు రీత్యా బాధ్యతను కుమారుడు శశికుమార్(26) తన భుజాన వేసుకున్నాడు. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూనే, సాగు బాట పట్టాడు. తండ్రికి వారసత్వంగా వచ్చిన మూడెకరాలతో పాటు తన గ్రామంలోనే మరో 8 ఎకరాలను కౌలుకు తీసుకున్నారు. నాలుగెకరాల్లో పత్తి, మరో నాలుగెకరాల్లో వరి వేశారు. కొడుకుకు సాయంగా తల్లిదండ్రులు కూడా పొలంబాట పట్టారు. పంటలు మంచిగ పండితే ఆర్థిక కష్టాలన్నీ తీరుతాయని కలలుగన్నారు.
సాగుకు పెట్టుబడిని కొడుకు శశికుమారే వెళ్లదీస్తున్నాడు. తనకు వచ్చే జీతంతో పాటు మరో రూ. 3లక్షలు ప్రైవేటు అప్పు తీసుకొచ్చాడు. పురుగు మందులు, కూలీలు ఇతరత్ర అవసరాల కోసం తెలిసినవారి వద్ద చేబదులు తీసుకువచ్చాడు. పెట్టుబడి పేరుకుపోతూనే ఉంది. కానీ కాలం అనుకూలించలేదు. పంటలకు సాగునీళ్లు కరువయ్యాయి. చీడపీడలు ఆశించాయి. వేసిన రెండు పంటలూ చేతి రాకుండాపోయాయి. సాగుకు చేసిన అప్పులు గుర్తుకొస్తున్నాయి. చేబదులు ఇచ్చిన వారు లెక్కలు అడుగుతున్నారు. దిక్కుతోచనిస్థితిలో శశికుమార్ మార్చి 27న రాత్రి పురుగుమందు తాగాడు. ‘అయ్యో కొడుకా… ఎంత పనిజేస్తివి’ అంటూ కన్నీరు కార్చుకుంటూ తల్లిదండ్రులు అర్ధరాత్రి వేళ శశికుమార్ను స్థానిక దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించిందని, ఖమ్మం తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు తే ల్చారు. అప్పటికప్పుడు మరికొంత అప్పు తీసుకొచ్చి ఖమ్మం తీసుకెళ్లారు. అయినా కొడుకు దక్కలే దు. వేసిన పంట, కన్న కొడుకు కండ్ల ముందే దూరమవడంతో రైతు కుటుంబం రోడ్డున పడింది.
మాది పేద కుటుంబం. వ్యవసాయం మీదపూ బతుకుతున్నాం. సాగు పనులన్నీ కొడుకే చూసుకుంటాడు. పాల్వంచలో ఒక ప్రైవేటు బిస్కెట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తూనే.. వచ్చిన జీతం కూడా పెట్టుబడికి పెట్టాడు. సాగు కోసం రూ. 3 లక్షలు వడ్డీకి తెచ్చిండు. మధ్యలో కొన్ని చేబదుళ్లు కూడా తెచ్చాడంట. ఇంతచేసినా పంట చేతికొచ్చేలా కన్పించట్లేదని తరచూ మాతో అంటుండేవాడు. భూ మాతను నమ్ముకున్న వాళ్లకు ఏమీ కాదని మేము ధైర్యం చెప్పేవాళ్లం. అప్పులు తీర్చే ఆలోచన కన్పించక ఎంత మధనపడ్డాడో ఏమో. తనువు చాలించి మాకు గుండె బరువు నింపాడు. ఆధారం కోల్పోయిన మా కుటుంబాన్ని సర్కారు ఆదుకోవాలి. -మంత్రి శంకర్, శశికుమార్ తండ్రి, యానంబైలు.