హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలిత రాష్ర్టాలకు ఒక నీతి.. ఇతర రాష్ర్టాలకు ఇంకో నీతి..ఇదీ కేంద్రంలోని బీజేపీ సర్కారు విధానం. డబుల్ ఇంజిన్ సర్కార్లకు లాభం చేకూరుస్తూ సింగిల్ ఇంజిన్ సర్కార్లకు మొండిచెయ్యి చూపుతూ కేంద్ర సర్కారు వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నది. ఇందుకు ఉజ్వల 2.0 పథకమే ప్రత్యక్ష ఉదాహరణ. ఉజ్వల లబ్ధిదారులకే గ్యాస్ సిలిండర్పై రూ. 200 సబ్సిడీ అందుతుండగా, దేశంలో సగం కనెక్షన్లు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే ఉండడం గమనార్హం. బీజేపీ ప్రభుత్వం ఉజ్వల యోజన పేరుతో పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రెండో దఫా కార్యక్రమాన్ని గతేడాది ఆగస్టులో ప్రారంభించింది. నాటి నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ వరకు మొత్తం 1.58 కోట్ల కనెక్షన్లను అందజేసింది. అయితే, ఇందులో మేజర్ వాటా బీజేపీ పాలిత రాష్ర్టాలకే చేరడం గమనార్హం. కేంద్రం ఇటీవల పార్లమెంట్లో ఇచ్చిన లెక్కలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.
వాళ్లకే సబ్సిడీ
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లకు ఇచ్చే రాయితీకి మంగళంపాడిన సంగతి తెలిసిందే. గత రెండేండ్లలోనే ఏకంగా 86 శాతం సబ్సిడీని ఎత్తివేసింది. ఇప్పుడు కేవలం ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్లు పొందిన లబ్ధిదారులకే ఒక్కో సిలిండర్కు రూ.200 చొప్పున సబ్సిడీ ఇస్తున్నది. కొత్తగా ఇచ్చిన కనెక్షన్లను బట్టి..కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్యాస్ సబ్సిడీలో మేజర్ వాటా బీజేపీ పాలిత రాష్ర్టాలకే చేరనున్నది. కోటిన్నర కనెక్షన్లకు ఇచ్చే సబ్సిడీలో 70 శాతం వరకు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని ప్రజల అకౌంట్లలోకే వెళ్లనున్నది. ఇది ఉజ్వల 2.0 పేరుతో బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్ర సర్కారు చేస్తున్న పరోక్ష కుట్ర అని నిపుణులు మండిపడుతున్నారు. అన్ని రాష్ర్టాలను సమానంగా చూడాల్సిన కేంద్రం వివక్షాపూరితంగా వ్యవహరించడం అన్యాయమని వాపోతున్నారు. బీజేపీయేతర రాష్ర్టాల్లోని నిరుపేదలకు కేంద్ర అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.