హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): మైనార్టీలను అణగదొక్కేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యూనిఫాం సివిల్కోడ్ (యూసీసీ) చట్టాన్ని తేవాలని చూస్తున్నదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ ఒక ప్రకటనలో విమర్శించారు. భిన్న సంసృతులతో విరాజిల్లుతున్న దేశంలో మతచిచ్చు పెట్టే యత్నాలను మానుకోవాలని కోరారు. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మైనార్టీలపై దాడులు, ప్రార్థనా మందిరాల విధ్వంసం జరుగుతున్నదని, అదే యూనిఫాం సివిల్కోడ్ తీసుకొస్తే ఆ రాష్ట్రాల్లో మైనార్టీలు బతికే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.
వచ్చే సార్వత్రిక, తెలంగాణ సహా వివిధ రాష్ర్టాల ఎన్నికల్లో ప్రజలను మతపరంగా విభజించి లబ్ధి పొందాలని బీజేపీ చూస్తున్నదని ఆరోపించారు. కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో కలిసి ఉంటున్న మతాల మధ్య చిచ్చు పెట్టలేరని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఏనాడూ మత ఘర్షణలు జరగలేదని తెలిపారు. దళితులు ఏ మతంలో ఉన్నా వివక్షకు గురవుతూనే ఉన్నారని, అందుకే దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.