జడ్చర్ల టౌన్, జూలై 25 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ పనులకు వెళ్తున్న ఇద్దరు యువతులు వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు జారీపడి మృతిచెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని కొండేడు గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కొండేడు గ్రామానికి చెందిన పడకంటి అనూష, పడకంటి స్వాతి కలిసి మంగళవారం ఉదయం గ్రామ శివారులోని తమ పత్తి పొలంలో కలుపు తీసేందుకు వెళ్తున్నారు.
పొలం వద్దకు వెళ్లేందుకు గ్రామశివారులోని వాగు దాటుతుండగా.. ప్రమాదవశాత్తు అందులో జారిపడ్డారు. అటుగా వెళ్తున్న గ్రామస్తులు వాగు వద్ద ఉన్న బండరాయిపై టవల్, టిఫిన్ బాక్సులు పడి ఉండటాన్ని గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గ్రామానికి చెందిన యువకులు వాగులోకి వెళ్లి యువతుల మృతదేహాలను వెలికితీశారు.
విషయాన్ని తెలుసుకున్న జడ్చర్ల సీఐ రమేశ్బాబు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల మార్చూరీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. పడకంటి అనూష పదోతరగతి వరకు చదువుకోగా, పడకంటి స్వాతి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నది. వాగులో పడి ఇద్దరు యువతలు మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న మహబూబ్నగర్ ఎస్పీ నరసింహ ఘటనా స్థలికి చేరుకొని వివరాలను తెలుసుకున్నారు.