Vande Bharat trains : వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ కానుక అందించారు. ఈ నెల 16న మోదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. నాగ్పూర్ – హైదరాబాద్, దుర్గ్ – విశాఖపట్నం మధ్య ఈ వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలియజేశారు.
ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధికంగా వందేభారత్ రైళ్ల అనుసంధానత ఉందని కిషన్ రెడ్డి అన్నారు. వయోవృద్ధుల సంక్షేమానికి ప్రధాని మోదీ ఆపన్న హస్తం అందించారని తెలిపారు. ‘70 ఏళ్లు దాటిన వారందరికీ రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించారు. పేద, ధనిక తేడా లేకుండా ఆరు కోట్ల మంది వయోవృద్ధులకు లబ్ధి చేకూరనుంది. వచ్చే రెండేళ్లలో ఈ పథకంపై రూ.3,437 కోట్లను కేంద్రం ఖర్చు చేయనుంది.
తెలంగాణ నుంచి అదనంగా మరో 10 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి జరగనుంది. 70 ఏళ్లు దాటిన వయో వృద్ధులందరికీ ఈ పథకం కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే ఆయుష్మాన్ పరిధిలో ఉన్న కుటుంబాల్లోని 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు అదనంగా ఏడాదికి రూ.5 లక్షల టాప్-అప్ కవర్ ఇవ్వనుంది. వయోవృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.