నిజామాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అక్క, చెల్లెలు ఇద్దరు హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్మూర్ పట్టణంలోని జిరాయాత్ నగర్లో నివసిస్తున్న మగ్గిడి రాజవ్వ (72), మగ్గిడి గంగవ్వ (62), ఇద్దరు అక్క, చెల్లెళ్లు. కాగా, అర్ధరాత్రి వారు నివసిస్తున్న ఇంట్లో గుర్తు తెలియని దుండగులు హత్య చేసి, ఇంటికి నిప్పంటించారు. బుధవారం వేకువజామున ఇంట్లో నుంచి పొగలు రావడంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
కిటికీలు బద్దలు కొట్టి మంటలు ఆర్పే క్రమంలో ఇద్దరు విగతజీవులుగా పడి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఇన్చార్జి సీపీ ప్రవీణ్కుమార్, ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్రావు, సీఐ సురేశ్ బాబు సందర్శించారు. పోలీసులు కేసు నమోదు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే నగలు, బంగారం కోసం దుండగులు వీరిని హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా అక్కా చెల్లెలు ఇద్దరు ఒంటరిగా నివసిస్తున్నట్లు సమాచారం.