సారంగాపూర్, మార్చి 5: గుండెపోటుతో రాష్ట్రంలో ఆదివారం ఇద్దరు మృతిచెందారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని కౌట్ల(బి) గ్రామానికి చెందిన వంగ లాల్రెడ్డి కుంటాల మండలం సూర్యాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం నిద్రలేచిన వెంటనే లాల్రెడ్డి గుండెలో నొప్పి వస్తున్నదని కుటుంబ సభ్యులకు చెప్పారు. వారు కారులో చికిత్స కోసం నిర్మల్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. మృతుడికి భార్య వనిత, ఇద్దరు కుమారులు ఉన్నారు.
బోనకల్లు, మార్చి 5: ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో గుండెపోటుతో ఓ విద్యార్థి మృతిచెందాడు. గ్రామానికి చెందిన మరీదు రాకేశ్ (18) మధిరలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్నాడు. రెండురోజుల క్రితం అతను గుండెనొప్పితో బాధపడుతుండగా తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ దవాఖానలో చికిత్స అందించారు. అక్కడి వైద్యులు హైదరాబాద్ తరలించి వెంటనే గుండెకు ఆపరేషన్ చేయించాలని సూచించారు. ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు కుమారుడిని ఇంటికి తీసుకొచ్చారు. డబ్బు సమకూర్చుకొని హైదరాబాద్కు వెళ్దామని సిద్ధమవుతుండగా, శనివారం
అర్ధరాత్రి గుండెపోటుతో రాకేశ్ మృతిచెందాడు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాలుడు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.