కొండపాక (కుకునూరుపల్లి)/శివ్వంపేట, ఏప్రిల్ 13 : నీళ్లు లేక వేసిన పంటలు ఎండిపోయి.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు రైతులు పురుగు మందు తాగి తనువుచాలించారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లికి చెందిన పాల పరమేశ్గౌడ్ (32) బ్యాంకుతోపాటు బయట అప్పులు చేసి ఇంటి నిర్మాణం చేపట్టాడు. తన వ్యవసాయ భూమితోపాటు తమ్ముడి పొలం లో వరి వేశాడు. పంట చేతికొచ్చిన తర్వాత కొంతవరకు అప్పులు తీరుతాయనుకున్నాడు. పంట సరిగ్గా పండకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మానసిక వేదనకు గురయ్యాడు.
ఈ క్రమంలో పరమేశ్కు బ్యాం కు అధికారులు ఇంటి రుణం కట్టాలని ఒత్తిడి తెచ్చారు. మనోవేదనకు గురైన ఆయన ఈనెల 7న వ్యవసాయబావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. భార్య, పిల్లలను చివరి సరిగా చూద్దామని ఇంటికి చేరుకున్న పరమేశ్ వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబసభ్యులు వెంటనే గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అతడిని పరిశీలించిన వైద్యులు పురుగుల మందు తాగినట్టు గుర్తించడంతోపాటు పరిస్థితి విషమంగా ఉన్నదని మెరుగైన వైద్యం కోసం పెద్ద దవాఖానకు తరలించాలని సూచించారు. అక్కడి నుం చి ములుగులోని ఆర్వీఎం దవాఖానలో చేర్పించగా చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి మరణించాడు. బాధిత రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్పల్లికి చెందిన తలారి బాలమణి (43) భర్తతో కలిసి తమకున్న రెండు ఎకరాలతోపాటు ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేస్తున్నారు. ఆరు ఎకరాల పొలంలో రెండు బోర్లు ఉన్నా భూగర్భ జలాలు అడుగంటడంతో నీరు రాక పంట ఎండిపోయింది. దీంతో మానసికంగా కుంగిపోయి ఈనెల 8న పురుగుల మందు తాగింది. గమనించిన కుమారుడు వెంటనే ములుగులోకి ఆర్వీఎం దవాఖానకు తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం సాయంత్రం మృతిచెందింది. బాలమణి కుమారుడు నరేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు శివ్వంపేట ఎస్సై మహిపాల్రెడ్డి తెలిపారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామానికి చెందిన రైతు కుందేళ్ల బాలయ్య (70) తనకు ఎర్రగట్టు పెద్దవాగు వద్ద ఉన్న పొలంలో మూడేండ్లుగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నాడు. శనివారం తోటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన క్రమంలో మోటర్ ఆన్ చేశాడు. నీటిని మళ్లించే క్రమంలో పైపులు జాయింట్ ఊడిపోయాయి. దీంతో మోటర్ ఆఫ్ చేసేందుకు వెళ్లగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. అతడి కుమారుడు శివ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రైతుకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.