మంచిర్యాల, మే 14 (నమస్తే తెలంగాణప్రతినిధి): తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రెండు ఐటీ కంపెనీలు.. ప్రపంచస్థాయి సంస్థలతో కలిసి పలు ప్రాజెక్టులను సక్సెల్ఫుల్గా నిర్వహిస్తూ ఔరా అనిపిస్తున్నాయి. ఫ్రాన్స్, హాంగ్కాంగ్, కెనడా, యూకే, యూఎస్, బంగ్లాదేశ్ లాంటి దేశాలతో పాటు బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ పట్టణాల నుంచి వందల సంఖ్యలో క్లయింట్స్ను డీల్ చేస్తున్నాయి. మల్టీ నేషనల్ కంపెనీలకు రిక్రూట్మెంట్ సర్వీసెస్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లాంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. కావాల్సినన్ని వనరులు ఉండే హైదరాబాద్, బెంగళూర్, చెన్నై లాంటి అగ్రశ్రేణి నగరాలను కాదని..
ఎలాంటి సదుపాయాలు లేని బెల్లంపల్లి మారుమూల పట్టణంలో వీటిని స్థాపించారు. ఈ కంపెనీల సీఈవోలు బెల్లంపల్లిలో పుట్టి, పెరిగి ఇక్కడే చదువుకున్నారు కాబట్టి.. స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతోపాటు.. సొంతూరుకు ఏదో ఒకటి చేయాలనే తపనతో ఇక్కడ ఐటీ సంస్థలను నెలకొల్పారు. ముంబైల్లో వ్యాల్యూపిచ్ ఐటీ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన చెన్నమాధవుని వెంకటరమణ, ఆయన భార్య కిరణ్ మృదుల బెల్లంపల్లి వాస్తవ్యులు. 2020 కరోనా ఫస్ట్ లాక్డౌన్లో బెల్లంపల్లికి వచ్చి ఇక్కడా వాల్యూపిచ్ను స్థాపించారు. ఇంటి దగ్గర ఉన్న కార్ షెడ్ నుంచి కంపెనీని మొదలుపెట్టి.. 200 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకొచ్చారు. తమ సంస్థ ద్వారా బెల్లంపల్లితోపాటు మంచిర్యాల జిల్లాకు చెందిన 1000 మందికి ఉద్యోగాలు కల్పించాలనేది టార్గెట్గా పెట్టుకున్నట్టు వెంకట రమణ తెలిపారు.
బెల్లంపల్లిలో ఉన్న రెండు ఐటీ కంపెనీల్లో సనాతన ఎనలిటిక్స్ అండ్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ ఒకటి. హైదరాబాద్లో శరవేగంగా ఐటీ విస్తరిస్తున్న రోజుల్లోనే అక్కడ జాబ్స్ వదిలేసి ఇక్కడ సంస్థను ప్రారంభించారు. రంగనాథరాజు, శ్రీనాథరాజు, సాయినాథరాజు అన్నదమ్ములు ఈ కంపెనీని నడుపుతున్నారు. సనాతన కంపెనీకి చెందిన ఈ షాప్స్ అండ్ మీ కాన్సెప్ట్ను రాష్ట్రంలోని టైర్-3, టైర్-4 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పైలట్ ప్రాజెక్ట్గా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పని చేస్తున్నారు. ప్రస్తుతం బెల్లంపల్లిలో 100 మందికి ఉద్యోగాలిచ్చారు. వీరంతా స్థానికులే కావడం గమనార్హం. వచ్చే నెలలో ఒక రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించి బెల్లంపల్లి కంపెనీలో మ్యాన్ పవర్ను కూడా పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు.
నేను నమ్మలేదు..
బెల్లంపల్లి పట్టణంలో రెండు ఐటీ సంస్థలు ఉన్నాయంటే నేను నమ్మలేదు. కానీ మా దుర్గం చిన్నయ్య పట్టుబట్టి నన్ను ఆ కంపెనీల దగ్గరికి తీసుకెళ్లారు. ఆ సంస్థలను చూసి నాకు ఆశ్చర్యం వేసింది. టెక్నాలజీతో ప్రపంచమే కుగ్రామంగా మారిపోతుందని బెల్లంపల్లి సంస్థలు నిరూపించాయి. ఆ సంస్థలను నడిపిస్తున్న యువకులు తలచుకుంటే.. వారికున్న టాలెంట్తో ఇప్పటికే లక్షలాది మంది తెలుగు పిల్లల్లా విదేశాలకు వెళ్లి స్థిరపడొచ్చు. కానీ.. వారు ఆలోచించలేదు. ఇక్కడే ఉండి స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. పుట్టిన ఊరుకు ఏదో ఒకటి చేయాలన్న వారి తాపత్రయాన్ని చూసి నేను స్ఫూర్తి పొందాను. బెల్లంపల్లికి మరిన్ని ఐటీ కంపెనీలు వస్తాయి.
– మంత్రి కేటీఆర్