భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 10: భువనగిరిలో ఇటీవల ఉరేసుకుని చనిపోయిన పదో తరగతి హాస్టల్ విద్యార్థినులవి ఆత్మహత్యలు కావని, అవి ప్రభుత్వం చేసిన హత్యలని బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. భువనగిరి పట్టణంలోని ఎస్సీ వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న గదిని శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థినుల తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి వసతి గృహ విద్యార్థులకు బడ్జెట్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భవ్యశ్రీ, వైష్ణవి ఆత్మహత్యలు అనుమానాస్పదంగా ఉన్నాయని, ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.
కొత్త ప్రభుత్వం వచ్చి రెండు నెలలు గడుస్తున్నా విద్యా, సాంఘిక సంక్షేమ శాఖలకు మంత్రులను కేటాయిచిందలేదని విమర్శించారు. పిల్లలవి ఆత్మహత్యలు కావని, వారి మరణాలకు ఆటో డ్రైవరే ప్రధాన సూత్రధారి అని, విద్యార్థినుల మెడపై గాట్లు ఉన్నాయని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినిపించుకోకుండా వారి బంధువులపైనే కేసు పెట్టించడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భవ్యశ్రీ, వైష్ణవి కుటుంబంలో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు రూ.కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12న శాంతియుతంగా సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహిస్తామని, ఈ ధర్నాలో బీఎస్పీతోపాటు అన్ని పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, డాక్టర్లు, విద్యావేత్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.