దేవరకద్ర రూరల్ (చిన్నచింతకుంట), ఫిబ్రవరి 23: సాగునీటి కొరత రైతుల ప్రాణాలు బలితీసుకొంటున్నది. పొలాలకు నీటిని పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై ఇద్దరు రైతులు మృతిచెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది. చిన్నచింతకుంట మండలం పర్దీపూర్కు చెందిన కుర్వ మల్లప్ప (50), గాజామోహన్రెడ్డి(55) రైతులు. పర్దీపూర్ రిజర్వాయర్ సమీపంలో మల్లప్పకు 6 ఎకరాలు, మోహన్రెడ్డికి 12 ఎకరాల పొలం ఉండగా.. వరి సాగు చేశారు.
రిజర్వాయర్ నీటిని వీరిద్దరు ఒకే బోరు ద్వారా పంపింగ్ చేస్తూ పంటలు పండిస్తున్నారు. అయితే రిజర్వాయర్లో నీటిమట్టం తగ్గి బోరుకు అందకపోవటంతో మోటర్ను నీళ్లు ఎక్కువగా ఉండేచోట ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పటికే అక్కడి నుంచి బోర్లకు కనెక్షన్ ఉన్న వైర్ తెగిపోయింది. అది గమనించకుండా శుక్రవారం ఉదయం తమ మోటర్ను నీటిగుంత వద్ద బిగించేందుకు నీళ్లలోకి దిగగానే ఇద్దరూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. పోలీసులు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. మృతదేహాలను జిల్లా దవాఖానకు తరలించారు.