తూప్రాన్/ధర్పల్లి, ఏప్రిల్ 28: అప్పుల బాధ తాళలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో మంగళవారం చోటుచేసుకున్నది. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ఎస్సై వినయ్ తెలిపిన వివరాల మేరకు.. ధర్పల్లి మండలం హొన్నాజిపేటకు చెందిన బాసవోయిన నర్సయ్య (51)కు భార్య లక్ష్మి, పిల్లలు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న నర్సయ్య.. రెండేండ్ల క్రితం అప్పులు తెచ్చి పెద్ద కూతురు పెండ్లి జరిపించాడు. అప్పులు తీర్చేదారి కనిపించకపోవడంతో మనస్తాపంతో జీవితంపై విరక్తి చెంది తన వ్యవసాయ భూమిలో గల చెట్టుకు ఉరేసుకున్నాడు.
కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్లాపూర్కు చెందిన రైతు దుర్గం యాదగిరి (50) తనకున్న 1.39 ఎకరాల పొలంతో పాటు రెండెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో కరెంట్ కోతలు, నీటి సమస్యతో పొలం ఎండిపోయింది. దీంతోపాటు ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపం చెంది మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి పొలం వద్దకు వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య శివమ్మ, కొడుకు దాసు, కూతురు సౌందర్య ఉన్నారు. తూప్రాన్ పోలీసులు కేసు నమోదుచేసుకుని విచారణ చేపట్టారు.