నల్లగొండ: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో రోడ్డు ప్రమాదం జరిగింది. వెలిమినేడు వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఓ ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, ప్రమాదంతో రెండు వాహనాలు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో వాహనాలను తొలగిస్తున్నారు. పెద్ద సంఖ్యలో వాహనాలు ఆగిపోవడంతో హైదరాబాద్ వెళ్లే వాహనాలను చిట్యాల నుంచి భువనగిరి రోడ్డులో మళ్లిస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ మృతదేహాన్ని దవాఖానకు తరలించారు.
మరో ఘటనలో జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో కండక్టర్ మృతిచెందారు. బుధవారం తెల్లవారుజామున జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై కొండగట్టు మూలమలుపు బల్వంతాపూర్ వద్ద వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో బస్సు కండక్టర్ అక్కడికక్కడే మరణించారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని కరీంనగర్కు చెందిన కండక్టర్ బొల్లం సత్యనారాయణగా గుర్తించారు.