హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): కరోనా మళ్లీ కలవరపెడుతున్నది. కొత్తగా పుట్టుకొచ్చిన జేఎన్.1 వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తున్నది. ఇప్పటివరకు పెద్దలనే ఇబ్బంది పెట్టిన కరోనా.. ఇప్పుడు పిల్లలపైనా తన ప్రభావాన్ని చూపుతున్నది. తాజాగా, శుక్రవారం నిలోఫర్ దవాఖానలో ఇద్దరు చిన్నారులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అందులో ఒక పాప వయసు 2 నెలలే కావటం గమనార్హం. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆ చిన్నారికి హై ఫ్లో ఆక్సిజన్ చికిత్స అందిస్తున్నట్టు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి తెలిపారు.
మరో కేసులో నాంపల్లిలోని ఆగాపురకు చెందిన 14 నెలల చిన్నారి తీవ్రమైన జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ మూడు రోజుల క్రితం దవాఖానలో చేరిందని, వెంటిలేటర్పై చికిత్స అందించి పరీక్షలు నిర్వహించగా కరోనా నిర్ధారణ అయ్యిందని వివరించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని తెలిపారు. వీరికి ప్రత్యేక ఐసొలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. చికిత్స విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావొద్దని, ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆక్సిజన్, వెంటిలేటర్, ఇతర అత్యవసర వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
పిల్లలో కరోనా వైరస్కు సంబంధించి తల్లిదండ్రులు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కరోనా నోడల్ అధికారి డాక్టర్ రమేశ్ దాంపురి తెలిపారు. గతంలోనూ ఈ వైరస్ పిల్లలపై పెద్దగా ప్రభావం చూపలేదని వెల్లడించారు. శ్వాససంబంధ సమస్యలున్న పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిన్నపిల్లలున్న కుటుంబసభ్యులు కరోనా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ముందు జాగ్రత్త చర్యగా నిలోఫర్లో 24 పడకలతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశామని వివరించారు.
రెండు, మూడు రోజుల్లోనే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో దాదాపు 20 కేసులు నమోదవటం, నిలోఫర్లో ఇద్దరు చిన్నారులకు సైతం సోకటంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని అన్ని టీచింగ్ హాస్పిటల్స్లో వైద్యాధికారులు, సిబ్బంది కరోనా నియమాలు పాటించాలని డీఎంఈ డాక్టర్ త్రివేణి ఆదేశాలు జారీ చేశారు. కచ్చితంగా మాస్క్ ధరించాలని సూచించారు. దీంతో అన్ని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్లో శుక్రవారం నుంచి కరోనా నియమాలు అమల్లోకి వచ్చాయి. వైద్య సిబ్బందితో పాటు రోగులు, రోగి సహాయకులు సైతం మాస్కులు ధరించేలా అధికారులు అవగాహన కల్పిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు.
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప దూర ప్రయాణాలు పెట్టుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు జన సమూహాలకు దూరంగా ఉండాలని, రానున్న క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి తదితర పండుగల సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. వాతావరణం కూడా చల్లగా ఉండటం, వరుస పండుగల నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్నదని వెల్లడించారు.
రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 9 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఇందులో 8 కేసులు హైదరాబాద్లో వెలుగుచూడగా, రంగారెడ్డి, వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లో ఒకటి చొప్పున నమోదయ్యాయి. మరోవైపు ఒకరు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 27 యాక్టివ్ కేసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. శుక్రవారం మొత్తం 1,245 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు. ఇందులో 68 నమూనాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉన్నదని వివరించారు. కొవిడ్పై సహాయం కోసం 104 నంబర్ను సంప్రదించాలని సూచించారు. వినతులు, ప్రైవేట్ దవాఖానలు, ల్యాబ్లపై ఫిర్యాదుకు 9030227324 నంబర్కు వాట్సాప్ ద్వారా సంప్రదించాలని సూచించారు.