నిజామాబాద్: నిజామాబాద్ (Nizamabad) జిల్లా వేల్పూర్ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున వేల్పూర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ క్రమంలో కారులో మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారు పూర్తిగా కాలిపోవడంతో మృతులకు సంబంధించిన వివరాలు లభించలేదు. నిజామాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో సరిహద్దు జిల్లాల పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.