హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావుపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చేసిన ‘క్షుద్ర పూజలు-తాంత్రిక పూజలు’ ఆరోపణలపై జాతీయ మానవ హకుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)ను న్యాయవాది, సామాజిక కార్యకర్త కారుపోతుల రేవంత్ ఆశ్రయించారు. ఎన్హెచ్చార్సీ సభ్యురాలు విజయ భారతి సాయనీకి మంగళవారం ఫిర్యాదు సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హరీశ్రావుపై ఎలాంటి ఆధారాలు లేకుండా శివమొగ్గ, తిరుచిరాపల్లిలో క్షుద్ర పూజలు నిర్వహించారని మీడియా ఎదుట మహేశ్కుమార్గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారని ఆక్షేపించారు.
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన వీడియో ద్వారా ఇదే తరహా ఆరోపణలు చేశారని, రాజ్యాంగబద్ధమైన, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం ఒక ప్రజాప్రతినిధి గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా, వారి మానవ హకులను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. మూఢనమ్మకాలపై ప్రభుత్వం, పోలీసుశాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో ఇలాంటి ప్రకటనలు చేయడం మూఢనమ్మకాల ఆధారిత నేరాలను ప్రోత్సహించే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. నిరాధార ఆరోపణలు చేసిన ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలకు పరిశీలించాలని, మూఢనమ్మకాల ఆధారితహింసను నివారించే దిశగా ప్రజాప్రతినిధులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఎన్హెచ్ఆర్సీని కోరినట్టు చెప్పారు.