వెంటనే స్పందిస్తున్న మంత్రి
చర్యల కోసం ఆదేశం
హైదరాబాద్, జూన్ 5(నమస్తే తెలంగాణ): సమ స్య ఏదైనా.. సమయం ఎప్పుడైనా.. దృష్టికొస్తేచాలు పరిష్కారానికి చర్యలు చేపడుతున్నా రు ఐటీశాఖ మంత్రి కేటీఆర్. ట్వీట్ చేసిన వెంటనే కొవిడ్ బాధితులకు సదుపాయాలు కల్పిస్తున్న కేటీఆర్కు కొన్నిరోజులుగా రెవెన్యూ సమస్యలపై వినతులు వెల్లువెత్తుతున్నాయి. రైతుబంధు రావడంలేదని, పట్టాదార్ పాస్ పుస్తకంలో డిజిటల్ సంతకం పెండింగ్లో ఉన్నదని తదితర సమస్యలతో కొందరు ట్వీట్ చేస్తున్నారు. వీటి విషయంలోనూ అంతే వేగంగా స్పందిస్తున్న కేటీఆర్.. చర్యలు తీసుకోవాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశిస్తున్నారు. ఇలా శనివారం పలు ట్వీట్లకు కేటీఆర్ స్పందించారు.
హాయ్ అన్న.. నా పేరు యెల్లేడు మధూకర్. తాండూరులో మూడు ఎకరాల భూమి కొనుగోలు చేశాను. మూడేండ్లు అవుతున్నా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాలేదు. పెండింగ్ మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేశాను. ధరణి పోర్టల్లో కనిపిస్తుంది. దయచేసి సమస్యను పరిష్కరించండి.
అన్న.. నా పేరు నర్సింహ. నాకు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మం డలం పటేల్గూడలో సర్వే నంబర్ 83లో రెండు ఎకరాల పట్టాభూమి ఉన్నది. కానీ పట్టాపాస్బుక్ రావడం లేదు. మా ప్రాపర్టీ ప్రొహిబిటెడ్ జాబితాలో చూపిస్తున్నది. దయచేసి సాయం చేయండి.
నా పేరు మండ గోవర్ధన్. నాది నిజామాబాద్ జిల్లా. మాకు గతేడాది జూన్లో రైతుబంధు ఇచ్చారు. రెండో సీజన్లో రాలేదు. తాసిల్ ఆఫీసులో అడిగితే పట్టాదారు పాస్బుక్ మీద డిజిటల్ సిగ్నేచర్ పెట్టాలన్నారు. కానీ, ఆ ఆప్షన్ ఇవ్వడం లేదు. సాయం చేయండి సార్.
సర్.. నా పేరు సంతోష్ పల్లేర్ల. మా అమ్మ 2016లో జగిత్యాలలో భూమి కొన్నది. ఇప్పటివరకు మ్యుటేషన్ పని కాలేదు. దయచేసి సహకరించండి.