హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ప్రయాణికుల సౌకర్యార్థం కర్ణాటకలోని దావణగెరెకు కొత్త సూపర్ లగ్జరీ సర్వీస్ను హైదరాబాద్లోని బస్భవన్లో శుక్రవారం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మధ్య కర్ణాటకలోని దావణగెరెకు ఇక్కడి నుంచి రాకపోకలు ఎకువగా జరుగుతుంటాయని, ప్రజల డిమాండ్ మేరకు కొత్త సర్వీస్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ఈ సర్వీస్ను ప్రయాణికులు ఉపయోగించుకొని, క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరు, రాయచూర్ తదితర ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నామని తెలిపారు. మియాపూర్ నుంచి దావణగెరెకు ప్రతిరోజు సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరుతుందని, దావణగెరె నుంచి ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్కు బయలుదేరుతుందని వివరించారు. మియాపూర్ నుంచి దావణగెరెకు రూ.872, ఎంజీబీఎస్ నుంచి రూ. 840 చార్జీగా సంస్థ నిర్ణయించినట్టు చెప్పారు.
అంతర్జాతీయ నిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బస్భవన్లో ‘వరల్డ్ స్లీప్డే థీమ్’ను ప్రముఖ పల్మనాలజిస్ట్, స్లీప్ డిజార్డర్ స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్తో కలిసి సజ్జనార్ ఆవిషరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరికీ కంటి నిండా నిద్ర చాలా అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఒకరూ జీవనశైలిని మార్చుకుని సమయానికి నిద్రపోవాలని డాక్టర్ నాగేశ్వర్ సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) డాక్టర్ వీ రవీందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, వినోద్కుమార్, మునిశేఖర్, సీపీఎం కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథరావు, సీటీఎం జీవన ప్రసాద్, సీటీఎం (ఎంఅండ్సీ) విజయ్కుమార్, రంగారెడ్డి ఆర్ఎం శ్రీధర్, డీవీఎం రాజు, మియాపూర్-1 డీఎం రామయ్య, సీఐ సుధ, డ్రైవర్లు, న్యూట్రిషియనిస్ట్ కావ్య తదితరులు పాల్గొన్నారు.