ప్రసాదం డోర్ డెలివరీ చేస్తాం: మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
పార్సిల్ ద్వారా చేరవేసేలా ఆర్టీసీ సేవలు: చైర్మన్ బాజిరెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 7 : మేడారం సమ్మక్క, సారలమ్మ మొక్కులు చెల్లించడంతోపాటు బెల్లం ప్రసాదాన్ని (బంగారం) డోర్ డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చేశామని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సోమవారం తెలిపారు. బంగారాన్ని ఆర్టీసీ పార్సిల్ సర్వీస్తోపాటు తపాలాశాఖ ద్వారా భక్తుల ఇండ్లకు చేరవేస్తామని చెప్పారు. సేవలు పొందేందుకు ఆన్లైన్లో మీసేవ కేంద్రాలు లేక టీయాప్ ఫోలియో TAPP-FOLIO మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. పోస్టల్శాఖ ద్వారా ఈ సేవలకు భక్తులు ఒక ప్రసాదం ప్యాకెట్కు రూ.225 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ప్యాకెట్లో రూ.200 గ్రాముల ప్రసాదంతోపాటు పసుపు- కుంకుమ, అమ్మవారి ఫొటో ఉంటాయని వివరించారు. పోస్టల్శాఖ సేవలు ఈ నెల 12 నుంచి 22వ తేదీవరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆర్టీసీ ద్వారా బంగారం పంపించే సేవలు ఈ నెల 11 నుంచి 17వ తేదీవరకు అందుబాటులో ఉంటాయని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. మొక్కు చెల్లించాలనుకొనేవారు ఆర్టీసీ పార్సిల్ సర్వీస్ను బుక్ చేసుకొంటే నేరుగా ఆ బంగారాన్ని మేడారంలోని సమ్మక్క, సారలమ్మలకు సమర్పించడంతోపాటు తిరిగి 200 గ్రాముల ప్రసాదాన్ని భక్తులకు చేర్చనున్నట్టు వివరించారు. 5 కిలోల వరకు బంగారాన్ని పంపించవచ్చని అన్నారు. ఇందుకు 200 కిలోమీటర్లకు (బుకింగ్ పాయింట్ నుంచి మేడారం) రూ.400, ఆపైన దూరం ఉంటే రూ.450 చార్జి వసూలు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని బస్స్టేషన్లు, ముఖ్యమైన కేంద్రాల నుంచి సైతం ఈ పార్సిల్ సర్వీస్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ 040-30102829, 040-68153333లో లేదా https://www.tsrtc.telangana.gov.inలో సంప్రదించవచ్చని సూచించారు.