హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని బస్భవన్ ప్రాంగణంలో కొత్త లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ, ఎక్స్ప్రెస్ బస్సులను ఆయన పరిశీలించారు. త్వరలోనే 2 వేలకు పైగా కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకరానున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 ఎలక్ట్రిక్ వాహనాలను వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించామని వివరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్, ఈడీ కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథరావు, సీటీఎం జీవనప్రసాద్ పాల్గొన్నారు.
మహాలక్ష్మి పథకంతో డ్రైవర్లు, కండక్టర్లపై అదనపు పని ఒత్తిడి పడుతున్నట్టు గుర్తించిన సంస్థ, డబుల్ డ్యూటీ చేసే డ్రైవర్లు, కండక్టర్ల రోజువారీ అలవెన్స్ (డీడీ వేతనం)ను పెం చింది. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో రెగ్యులర్ డ్రైవర్లకు రూ.740 నుంచి రూ.900కు, రెగ్యులర్ కండక్టర్కు రూ.700 నుంచి రూ.850కు, కాంట్రాక్ట్ డ్రైవర్కు 590 నుంచి 720కు, కాంట్రాక్ట్ కండక్టర్కు 510 నుంచి 720కు పెంచారు. ఇతర రీజియన్లలో రెగ్యులర్ డ్రైవర్లకు రూ.600 నుంచి రూ.730కు, కండక్టర్లకు రూ.530 నుంచి రూ.650కు, కాంట్రాక్ట్ డ్రైవర్లకు రూ.480 నుంచి 590కు, కాంట్రాక్ట్ కండక్టర్లకు రూ.420 నుంచి రూ.510కు పెంచారు.