TSRTC | మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. గత జాతరలో మాదిరిగానే ఈసారి కూడా సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే సేవను అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు దేవాదాయ శాఖతో టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఒప్పందం కుదుర్చుకుంది. దేవస్థానం నుంచి అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను కూడా భక్తులకు అందజేయనుంది.
మేడారం మహా జాతర ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరగనుంది. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆన్లైన్/ఆఫ్లైన్లో అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని టీఎస్ఆర్టీసీ కల్పించింది. భక్తులు రూ.299 చెల్లించి సమీపంలోని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్(కార్గో) కౌంటర్లలో, పీసీసీ ఏజెంట్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ల వద్ద మేడారం ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చు.
రాష్ట్రంలోని అన్ని లాజిస్టిక్స్ (కార్గో) కౌంటర్లు, పీసీసీ ఏజెంట్స్తో పాటు డిపోల పరిధిలో విధులు నిర్వర్తించే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లను సంప్రదించి ప్రసాదాన్ని ఆర్డర్ ఇవ్వొచ్చని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. https://rb.gy/q5rj68 లింక్ పై క్లిక్ చేసిగానీ లేదా పేటీఎం ఇన్ సైడర్ యాప్ లోనూ సులువుగా అమ్మవార్ల ప్రసాదాన్ని ఆర్డర్ ఇవ్వొచ్చని పేర్కొన్నారు. ఆన్లైన్ బుకింగ్ సమయంలో భక్తులు తమ సరైన చిరునామా, పిన్ కోడ్, ఫోన్ నంబర్ను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. మేడారం ప్రసాద బుకింగ్కు సంబంధించిన పూర్తి వివరాలకు సమీపంలోని లాజిస్టిక్స్ కౌంటర్లను గానీ, టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440069, 040-69440000, 040-23450033 సంప్రదించాలన్నారు.