హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 7: మేడారం మహాజాతరకు ఆర్టీసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆర్టీసీ హైదరాబాద్, కరీంనగర్ జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్ తెలిపారు. సోమవారం హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. జాతరకు ప్రత్యేకంగా 3,845 బస్సులను కేటాయించినట్టు పేర్కొన్నారు. వరంగల్ రీజియన్ నుంచి 2,250 బస్సులు ఈ నెల 13 నుంచి 20 వరకు నడిపించనున్నట్లు చెప్పారు. కరీంనగర్ నుంచి 530, ఆదిలాబాద్ నుంచి 320, ఖమ్మం నుంచి 345, రంగారెడ్డి నుంచి 150, సికింద్రాబాద్ (వరంగల్ రీజియన్ ఏడు పాయింట్లు) 200, మెదక్ (హుస్నాబాద్) నుంచి 50 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులు అమ్మవార్ల గద్దెల వరకు వెళ్లవచ్చని తెలిపారు.
వేములవాడ క్షేత్రం సోమవారం జనసంద్రంగా మారింది. మేడారం జాతర నేపథ్యంలో శ్రీరాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రద్దీ దృష్ట్యా భక్తులు నిర్వహించే ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. 70 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారని, రూ.24 లక్షల ఆదాయం వచ్చినట్టు ఈవో వెల్లడించారు. -వేములవాడ టౌన్