హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): ఈ నెల 14 నుంచి ప్రారంభంకానున్న కార్తీకమాసంలో తెలంగాణ, ఏపీలోని ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్టు టీఎస్ఆర్టీసీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణలోని పంచశైవ క్షేత్రాలైన వేములవాడ, వెయ్యిస్తంభాల గుడి, పాలకుర్తి, కాళేశ్వరం, రామప్పగుడికి బస్సులను నడపనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ నెలలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరి ఆయా ఆలయాల దర్శనాననంతరం సోమవారం రాత్రి హైదరాబాద్ నగరానికి చేరుకుంటుందని తెలిపారు.
రాజధాని బస్ సర్వీస్కు రూ.2400, సూపర్ లగ్జరీ రూ.1900, ఎక్స్ప్రెస్ బస్సుకు రూ.1500గా చార్జీలు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఏపీలోని అమరావతి, ద్రాక్షారామం, భీమవరం, పాలకొల్లు, సామర్లకోటలోని పంచారామ క్షేత్రాలకూ బస్సులను నడపనున్నట్టు తెలిపారు. ప్రతి ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ నుంచి ఈ బస్సు బయలుదేరుతుందని, మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటుందని పేర్కొన్నారు. రాజధాని బస్సులో రూ.4 వేలు, సూపర్ లగ్జరీ బస్సులో రూ.3,200గా చార్జీలు ఉంటాయని పేర్కొన్నారు. దర్శనం, వసతి కోసం రూ.550 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.