Free Bus For Women | హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకంలో మహిళలు తప్పనిసరిగా ఒరిజినల్ గుర్తింపు కార్డును వెంట తేవాల్సిందేనని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరోసారి తేల్చిచెప్పారు. కొందరు మహిళా ప్రయాణికులు సెల్ఫోన్లలో లేదా జిరాక్స్ కాపీలు చూపుతూ కండక్టర్లపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ నూతన మార్గదర్శకాలను ఖరారు చేసింది. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, చిరునామా స్పష్టంగా కనిపించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డు అయినా ఈ స్కీంకు వర్తిస్తుందని ఎండీ తెలిపారు.
పాన్కార్డులో అడ్రస్ లేనందున అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. మహిళా ప్రయాణికులందరూ జీరో టికెట్ను తీసుకోవాలని, ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని చెప్పారు. ఉచితమే కదా.. జీరో టికెట్ ఎందుకు తీసుకోవాలని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారని, ఇది సరికాదని హితవు పలికారు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తే రూ.500 జరిమానా విధిస్తామని ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ మహిళలకే వర్తిస్తుందని, ఇతర రాష్ర్టాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్ తీసుకోవాలని తెలిపారు.