హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి వేళల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు వాష్రూం సదుపాయం వినియోగించుకునేలా ఆయా బస్సు రూట్లలోని పెట్రోల్ బంక్ల వద్ద పదినిమిషాల పాటు బస్సు ఆపేలా ఆదేశాలు జారీ చేశారు. పాలె నిషా అనే యువతి చేసిన ట్వీట్కు సత్వరమే స్పందించిన ఎండీ సజ్జనార్ ఈ మేరకు ఆర్టీసీ అధికారులందరికీ ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు.
‘మహిళలు రాత్రి సమయంలో ప్రయాణిస్తున్నప్పుడు.. స్త్రీల అవసరాల నిమిత్తం పెట్రోల్ బంకుల్లో పది నిమిషాలపాటు బస్సు ఆపితే మహిళలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. (అవసరాలు బయటికి చెప్పలేరు కాబట్టి) ఈ నిర్ణయం వల్ల గవర్నమెంట్కు కూడా ఎటువంటి భారం ఉండదు’ అంటూ నిషా అనే యువతి మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ట్వీట్ చేశారు.
దీనిపై నిమిషాల వ్యవధిలోనే స్పందించిన సజ్జనార్ ఈ మేరకు ఆదేశాలిచ్చినట్టు రీ ట్వీట్ చేశారు. మహిళల ఇబ్బందులపై వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోవడం నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.