హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): దసరా పండుగకు సొంతఊళ్లకు వెళ్లేవారు ప్రైవేటు వాహనాల్లో ప్రమాదకరంగా ప్రయాణించవద్దని, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని ఎండీ సజ్జనార్ ప్రజలను కోరారు. పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ 4035 బస్సులు అందుబాటులో ఉంచిందని పేర్కొన్నారు. ప్రయాణికులపై ఆర్టీసీ ఎలాంటి అదనపు చార్జీల భారం కూడా వేయదని అన్నారు. దసరా ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా నడుపుతున్న ప్రత్యేక బస్సులను వీసీ సజ్జనార్ స్వయంగా పరిశీలించారు. బుధవారం రాత్రి స్వయంగా ఎల్బీనగర్ చౌరస్తాకు వెళ్లిన సజ్జనార్ అక్కడ ఆర్టీసీ సిబ్బంది పనితీరును గమనించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా, అదే సమయంలో సంస్థ ఆదాయం పెంచేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆర్టీసీ సిబ్బందిని, వారికి సహకారం అందిస్తున్న ఎల్బీనగర్ ట్రాఫిక్సిబ్బందిని ఆయన అభినందించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను తరలిస్తున్న వైట్ నంబర్ప్లేటు ఉన్న సొంత వాహనాలను రెండు రోజుల్లో 20 వరకు సీజ్ చేసినట్టు సజ్జనార్ వెల్లడించారు.