TSRTC | టీఎస్ ఆర్టీసీకి రాఖీ పండుగ భారీ ఆదాయం తెచ్చిపెట్టింది. గురువారం ఒక్కరోజే రూ. 22.65 కోట్ల ఆదాయం వచ్చినట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్టైమ్ రికార్డు అని సజ్జనార్ పేర్కొన్నారు. గతేడాది రాఖీ పండుగ రోజున రూ. 21.66 కోట్ల ఆదాయం వచ్చినట్లు గుర్తు చేశారు. కానీ ఈ సారి రూ. కోటి వరకు అదనంగా ఆదాయం సమకూరింది.
రాఖీ పండుగ నాడు.. రికార్డు స్థాయిలో 40.91 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్లు తెలిపారు. గతేడాదితో పోల్చితే అదనంగా లక్ష మంది రాకపోకలు సాగించారు. ఆక్యుపెన్సీ రేషియో విషయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా గతేడాది రికార్డును అధిగమించింది. గతేడాది రాఖీ పండుగ నాడు 101.01 ఆక్యుపెన్సీ సాధించగా, ఈ ఏడాది 104.68 శాతం నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో 97.05 శాతం, ఉమ్మడి కరీంనగర్, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లో 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీ రేషియో నమోదైనట్లు వివరించారు.