TSRTC | ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణానికి ఒరిజినల్ ఐడీ కార్డు తప్పనిసరి అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మహిళలు, బాలికలు, థర్డ్ జెండర్లు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారని అన్నారు. అయితే ప్రయాణ సమయంలో కొందరు మహిళలు ఒరిజినల్ గుర్తింపు కార్డులు తీసుకురావడం లేదని తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. గుర్తింపు కార్డు ఫొటో కాపీలను తీసుకొస్తున్నారని.. స్మార్ట్ఫోన్లలో సాఫ్ట్ కాపీలను చూపిస్తున్నారని తెలిసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్, డ్రైవింగ్, తదితర గుర్తింపు కార్డులను చూపించి ఒరిజినల్ ఆధార్, ఓటర్, డ్రైవింగ్, తదితర గుర్తింపు కార్డులను తీసుకోవాలని మహిళలను కోరారు.
ఫోటో కాపీలు, స్మార్ట్ఫోన్లలో ఐడీ కార్డులు చూపిస్తే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. గుర్తింపు కార్డుల్లోనూ ఫొటోలు స్పష్టంగా కనిపించాలని తెలిపారు. చాలామంది ఆధార్ కార్డుల్లో చిన్నప్పటి ఫొటోలు ఉన్నాయని.. వాటిని వెంటనే అప్డేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణకు చెందిన మహిళలకే ఉచిత బస్సు ప్రయాణం పథకం వర్తిస్తుందని.. ఇతర రాష్ట్రాల మహిళలు విధిగా చార్జీలు చెల్లించి టికెట్ తీసుకోవాలని స్పష్టం చేశారు.
జీరో టికెట్ల విషయంలో నిర్లక్ష్యం తగదు
జీరో టికెట్ల విషయంలో మహిళలు నిర్లక్ష్యంగా ఉండొద్దని.. ప్రతి ఒక్కరూ విధిగా టికెట్ తీసుకోవాలని కోరారు. జీరో టికెట్ జారీ చేస్తేనే ఆ చార్జీని టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని స్పష్టం చేశారు. కాగా, ఈ నెల 9వ తేదీ నుంచి మహాలక్ష్మీ స్కీమ్ కింద ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. అప్పట్నుంచి 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 3 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని టీఎస్ఆర్టీసీ వెల్లడించింది.