హైదరాబాద్: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ మరో శుభవార్త అందిచింది. తిరుమల శ్రీవారి భక్తుల కోసం నిజామాబాద్ నుంచి తిరుపతికి ఏసీ బస్సులను ప్రారంభిస్తున్నది. నేడు నిజామాబాద్లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సర్వీసుకు జెండాఊపి ప్రారంభించనున్నారు. ఆర్టీసీ బస్సులో తిరుమల వెళ్లే భక్తులకు బస్ టికెట్తో పాటు రూ.300 శీఘ్ర దర్శన టోకెన్ అందిస్తారు. తిరుపతి నుంచి తిరుమలకు అక్కడి స్థానిక బస్సులో తీసుకెళ్లి ఉదయం 10 గంటలకు శీఘ్ర దర్శనం కల్పించనున్నారు. కనీసం వారం ముందు www.tsrtconline.in నుంచి టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 1న హైదరాబాద్ నుంచి తిరుపతికి ఆర్టీసీ సేవలు మొదలైన విషయం తెలిసిందే.
ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఎట్టకేలకు అనుమతి లభించింది. కార్పొరేషన్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మరణించిన ఉద్యోగి కుటుంబసభ్యుల్లో ఒకరిని ఉద్యోగంలోకి తీసుకోనున్నట్టు సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. కొవిడ్ విపత్కర పరిస్థితులు, డీజిల్, ఇతర ఖర్చుల పెరుగుదల, ఉద్యోగుల క్రమబద్ధీకరణతో సంస్థకు అదనపు సిబ్బంది అవసరం పెరిగిందని, ఈ మేరకు 2019 నుంచి పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను భర్తీ చేయాలని సంస్థ నిర్ణయించినట్టు పేర్కొన్నారు.
ఉద్యోగి మరణించిన తేదీ ఆధారంగా సీనియారిటీని అనుసరించి కారుణ్య నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఉద్యోగి కుటుంబసభ్యుల అర్హతలను అనుసరించి డ్రైవర్ గ్రేడ్– 2, కండక్టర్ గ్రేడ్– 2, ఆర్టీసీ కానిస్టేబుల్, శ్రామిక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డ్రైవర్లకు రూ.19 వేలు, కండక్టర్లకు రూ.17 వేలు, ఆర్టీసీ కానిస్టేబుళ్లు, శ్రామిక్లకు రూ.15 వేల చొప్పున జీతాలు ఇవ్వనున్నారు. మూడేండ్ల పనితీరు ఆధారంగా వారిని రెగ్యులర్ చేయనున్నారు.