హైదరాబాద్ : అన్ని స్థాయిలోని ఉద్యోగుల సమిష్టి కృషి , వంద రోజుల కార్యక్రమం, అధికారుల ప్రణాళిక కార్యాచరణ అమలు వంటి విధానాల ఫలితంగా సంస్థ నష్టాలను తగ్గించుకోగలుగుతోందని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. సిబ్బంది వృత్తి నైపుణ్యం పెంపు, ప్రయాణికులకు సంతృప్తికర సేవలు, సంస్థ నష్టాలను తగ్గించడం, రాబడిని పెంచడం వంటి అంశాలపై ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం పేరిట నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు అన్ని డిపోలు, యూనిట్లలో సోమవారం ప్రారంభమయ్యాయి.
విధి నిర్వహణలో సమర్థత, నైతికత, నాణ్యమైన సేవలు, సానుకూల వైఖరి, స్వీయ ప్రేరణ, ప్రయాణికుల అంచనాలు, వారి నమ్మకాన్ని చూరగొనటం, ఒత్తిడి నిర్వహణ, పనితీరు మెరుగుపరుచుకునే విధంగా అనుభవమున్న అధ్యాపకులతో ఈ శిక్షణను కూర్పు చేశారు. ‘మనదే మనదే మహా సంస్థ’ అనే పాటతో ప్రారంభమైన ఈ శిక్షణలో ‘కలిసి పని చేద్దాం – మనమందరం’ అనే కాన్సెప్ట్ ప్రజెంటేషన్ ద్వారా సిబ్బంది, అధికారులు సంస్థ అభ్యున్నతి కోసం చేయాల్సిన కృషిని కళ్లకు కట్టారు. కాగా, నెల రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణలో ప్రధానంగా ప్రయాణీకులకు సంతృప్తికరమైన సేవల్ని అందించడంపై దృష్టి సారించినట్లు ఛైర్మన్, ఎండీ వెల్లడించారు.
ఇటీవల కాలంలో ఆటుపోట్లను తట్టుకొని నిలబడుతూ ఉద్యోగులందరి సహకారంతో సంస్థ పురోగతి వైపు దిశగా పయనిస్తుండటం మంచి పరిణామమన్నారు. గత సంవత్సరంలో రూ. 864.07 కోట్ల నష్టం చవిచూడగా, ప్రస్తుత సంవత్సంలో రూ. 348.12 కోట్ల మేర నమోదు కావడం అంటే రూ. 515.95 కోట్ల వరకు నష్టాల్ని తగ్గించుకోగలగడం అందరి కృషి వల్లే సాధ్యమైందన్నారు. కార్గో, పార్శిల్ ద్వారా 2021 సంవత్సరంతో పోలిస్తే 2022 లో గత జులై నెల వరకు సంస్థ రూ.11.02 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగలిగిందని చెబుతూ ఈ దిశలో అందరి ప్రయత్నం ఉండాలని కోరారు. వృత్తి నైపుణ్య పెంపునకు శిక్షణ ఎంతో ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడగలదంటూ ప్రయాణీకులు కోరుకునే సురక్షితమైన ప్రయాణం, నమ్మకమైన సేవల్ని మరింత మెరుగ్గా అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.