హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు టీఎస్ఆర్టీసీకి బాగా కలిసొచ్చాయి. ఈ ఎన్నికల సందర్భంగా అక్టోబర్ 9 నుంచి నవంబర్ 29 వరకు వివిధ రాజకీయ పార్టీలకు 10,587 బస్సులను అద్దెకు ఇవ్వడం ద్వారా ఏకంగా రూ.24.13 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది.
ఎన్నికల సభలకు జనాన్ని తరలించేందుకు ఈ బస్సులు మొత్తం 26,22,176 కి.మీ. దూరం తిరిగాయని, తద్వారా కిలోమీటర్కు సగటున రూ.92.05 చొప్పున ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు. దీనితోపాటు పోలింగ్ సామాగ్రి, ఎన్నికల అధికారుల తరలింపునకు 4,006 బస్సులను అద్దెకు తీసుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్.. ఒక్కో బస్సుకు రోజూ రూ.20 వేల చొప్పున అద్దె చెల్లించినట్టు తెలిపారు.