TSRTC | కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48గంటల్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని.. దాన్ని అమలు చేయడంలో ఆర్టీసీ బాధ్యతను నెరవేరుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇప్పటి వరకు పథకంలో భాగంగా 25కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారన్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్లో రూ.280కోట్ల బాండ్స్ నెక్లెస్ రోడ్డులో సీఎం, డెప్యూటీ సీఎం ప్రకటించారు. రెండు రోజుల్లోనే పేమెంట్స్ జరుగుతాయన్నారు. కార్మికులకు బోనస్, ఇతర బెనిఫిట్స్ ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నామన్నారు. 21శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని.. దాంతో ప్రతి ఏటా రూ.418.11కోట్ల భారం పడుతుందన్నారు. ఆర్టీసీ కుటుంబాలు తమకు మద్దతు తెలిపాయన్న మంత్రి.. వారికి అండగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జూన్ ఒకటి నుంచి అమలులోకి వస్తుందన్నారు. మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత బస్లు, బస్టాండులు కళకళలాడుతున్నాయన్నారు. 60శాతం ఉన్న ఆక్యుపెన్సీ వందశాతం దాటుతుందన్నారు.
ఆర్టీసీలో నూతన ఉద్యోగ నియామకాలు చేపడుతామని మంత్రి తెలిపారు. మూడువేల బస్సులు కొత్తగా వస్తున్నాయని.. ఎక్కడ కూడా బస్సులు తగ్గించే పరిస్థితి ఉండదన్నారు. సంస్థను ముందుకు తీసుకువెళ్లేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 16 నుంచి పిట్మెంట్ 21శాతానికి పెంచేందుకు కృషి చేసిన సీఎం, ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. 53,071 మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. భారీ ప్రకటనలో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం విలీనంపై పరిశీలిస్తుందన్నారు. బస్సులు పెంచుతున్నామని.. కొత్త రూట్లలో బస్సులు నడపాలని డిమాండ్స్ వస్తున్నాయన్నారు. ప్రభుత్వం, మంత్రిపై కోపం ఉంటే వేరే పద్ధతిలో వెళ్లాలని.. ఆర్టీసీపై విమర్శలు ఆపాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైల్వేలాగా ఆర్టీసీ బస్సులు పని చేస్తున్నాయన్నారు. ఆర్టీసీని బ్లేమ్ చేయాలని చూస్తున్నారని.. ఆర్టీసీకి మహిళలకు ఉచితంగా ఇస్తుంటే.. ఆటో వాళ్లని రెచ్చగొడుతున్నారన్నారు. ఎవరికి ఏఏ డిపార్ట్మెంట్లు, ఎన్ని పోస్టులు వస్తున్నాయనేది డీటైల్స్ ఇస్తామన్నారు.