Group-1 Prelims | తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరుగనున్నది. పరీక్ష కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 10.30 నుంచి ఒంటిగంట వరకు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరుగనుండగా.. అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక సూచనలు చేసింది. అభ్యర్థులు వాచీలు, హ్యాండ్బ్యాగ్స్, పర్సులు తీసుకువచ్చేందుకు అనుమతి లేదని తెలిపింది. అభ్యర్థులు చెప్పులే వేసుకోవాలని, షూ వేసుకోవదని చెప్పింది. వెబ్సైట్లోని నమూనా ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ ప్రాక్టీస్ చేయాలని కోరింది. పరీక్షలో బ్లాక్ లేదా బ్లూ బాల్పాయింట్ పెన్ను మాత్రమే వాడాలని చెప్పింది.
పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు శాశ్వతంగా డిబార్ చేస్తామని హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. గ్రూప్-1 ప్రిలిమ్స్ 33 జిల్లా కేంద్రాల్లోని 994 కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నాయి. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్లో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 16న పరీక్ష నిర్వహించగా.. ఇటీవల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. మళ్లీ ఇటీవల జూన్ 11న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. అయితే, పరీక్ష 3,80,032 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారందరినీ మళ్లి పరీక్షకు అనుమతించనున్నారు.