Group-4 Preliminary Key | హైదరాబాద్ : రాష్ట్రంలో అతిపెద్ద ఉద్యోగ నోటిఫికేషన్ గ్రూప్-4 ప్రిలిమినరీ కీని టీఎస్పీఎస్సీ సోమవారం విడుదల చేసింది. కీలో అభ్యంతరాలు తెలియజేసేందుకు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో గ్రూప్-4 కేటగిరీలో 8,039 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్ 1వ తేదీన టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అత్యధికంగా 9,51,205 మంది దరఖాస్తు చేశారు. జూలై 1వ తేదీన పరీక్ష నిర్వహించగా.. పేపర్-1కు 7,63,835 మంది, పేపర్-2కు 7,61,026 మంది హాజరయ్యారు.
ప్రిలిమినరీ కీతోపాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు, మాస్టర్ క్వశ్చన్ పేపర్ను కూడా https://www.tspsc.gov.in వెబ్సైట్లో కమిషన్ అందుబాటులో ఉంచింది. సెప్టెంబర్ 27వ తేదీ వరకు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. ప్రిలిమనరీ కీలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే కమిషన్ వెబ్సైట్ ద్వారా తెలియజేయాలని సూచించారు. అభ్యర్థులు నేరుగా, పోస్టు లేదా మెయిల్ ద్వారా తెలిపిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. అభ్యంతరాలకు సంబంధించి ఆధారాలను తప్పనిసరిగా పీడీఎఫ్ ఫార్మట్లో జతచేయాలని తెలిపారు. గ్రూప్-4 ఫలితాలను అక్టోబర్ నెలలో ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది.