TSPSC | హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-4 రాత పరీక్షను జులై 1వ తేదీన నిర్వహించనున్నారు. అయితే పలువురు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులు చేశారు. దీంతో అభ్యర్థుల వినతుల మేరకు తమ దరఖాస్తుల్లో తప్పులు సరిచేసుకునేందుకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులను సరి చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ సూచించింది.
గ్రూప్ -4 కింద 8,039 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన విషయం విదితమే. భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేపట్టడంతో అదే స్థాయిలో గ్రూప్-4కు 9 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. చాలా మంది దరఖాస్తు చేసే సమయంలో చిన్నచిన్న పొరపాట్లు చేసినందుకే ఎడిట్కు అవకాశం కల్పించారు.