బొడ్రాయిబజార్, జూన్ 7: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్దిందని, ఇది దళితుల జీవితబంధు అని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన ఎమ్మార్పీఎస్ టీఎస్ సమావేశంలో మాట్లాడుతూ.. దళితబంధును దేశ వ్యాప్తంగా అమలు చేస్తేనే దళితుల బతుకులు మారుతాయని పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దళితులపై ఏమాత్రం ప్రేమ ఉన్నా దేశమంతా దళితబంధును ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టుగానే.. ఇతర రాష్ర్టాల్లో కూడా పెట్టాలని కోరారు. బీజేపీ పాలకులు అంబేద్కర్ ఫొటోలు పెట్టుకోవడం కాదని, అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని అమలు చేయాలని సూచించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అంబేద్కర్ను అందరివాడిగా చేసి ఆయన ఆలోచనా విధానాన్ని అమలు చేస్తున్నారని కొనియాడారు.
కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటామని ఎన్నికల్లో చెప్పి అనంతరం విస్మరించిందని విమర్శించారు. ‘మేమెంతో మాకంత వాటా’ కోసం ఈ నెల 30న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని వంగపల్లి కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పడిదల రవికుమార్, నాయకులు పల్లెటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.