(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ‘దేశం అభివృద్ధి సాధించాలంటే గుజరాత్ మాడల్ అవసరం..గుజరాత్ను నేనే అభివృద్ధి చేశా’..అంటూ ఇప్పటివరకూ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు గప్పాలే అని తేలిపోయింది. దేశాభివృద్ధికి ఈ మాడల్ ఎంతమాత్రం ఆచరణయోగ్యం కాదని రూఢీ అయ్యింది.
భారత్ అభివృద్ధికి తెలంగాణ మాడలే సరైనదని రుజువైంది. బుధవారం ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఢిల్లీ, కేరళ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, పినరాయి విజయన్, భగవంత్ మాన్సింగ్తోపాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజాలాంటి రాజకీయ ఉద్దండులు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసి చూపించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని కొనియాడటం, తమ రాష్ర్టాల్లో కూడా ఈ పథకాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని పేర్కొనడమే దీనికి నిదర్శనం. ‘తెలంగాణలో పని ఎక్కువ జరిగింది.. ప్రచారం తక్కువగా జరిగింది. మా దగ్గర మాత్రం పని తక్కువ.. ప్రచారం ఎక్కువ’ అంటూ అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ప్రభుత్వ పనితీరుకు అద్దంపట్టాయి. బీఆర్ఎస్తోనే వెలుగు జిలుగుల భారతం సుసాధ్యమని తేలిపోయింది.
మాటల్లో కాదు..చేతల్లో చూపారు
గుజరాత్ మాడల్ ప్రసంగాలకే పరిమితమైతే.. తెలంగాణ మాడల్ చేతల్లో చూపడంలో సీఎం కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అన్నదాతల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం, దళితుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతి కోసం దళిత బంధు, ఉద్యోగ నియామకాలు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మిలాంటి వినూత్న పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేసి చూపించింది. ఈ పథకాలను మెచ్చి, నచ్చి తమ రాష్ర్టాల్లో కూడా అమలు చేస్తామని ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలోనే ఉత్తర, దక్షిణాది రాష్ర్టాల సీఎంలు ప్రకటించడం విశేషం. ఈ దేశానికి అసలు సిసలైన తెలంగాణ మాడల్ అవసరమని తేల్చేశారు. బీఆర్ఎస్కు దేశ ప్రజలు పట్టం కడితే…తెలంగాణ పథకాలను దేశమంతటా అమలు చేస్తామని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించడం ద్వారా తెలంగాణ మాడల్ భవిష్యత్ దేశ రాజకీయాలకు ఒక మార్గదర్శకం కాబోతున్నది.
గుజరాత్ మా‘డల్’!
27 ఏండ్ల బీజేపీ పాలనలో మిగతా రాష్ర్టాలతో పోలిసే గుజరాత్ సామాజికంగా ఎంతో వెనుకబడిపోయింది. గుజరాత్లోని ప్రతీ ఐదుగురిలో ఒకరు పేదరికంలో మగ్గిపోతున్నారు. పేదరికం విషయంలో గుజరాత్తో పోలిస్తే దేశంలో 22 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు (యూటీలు) మెరుగైన స్థితిలో ఉన్నాయని ‘నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్’ నివేదిక తేల్చిచెప్పింది. ఉద్యోగాలు, జీఎస్డీపీ/జీడీపీ వృద్ధిరేటు, తలసరి ఆదాయం, వ్యవసాయరంగంలో వృద్ధిరేటు, ఆదాయాభివృద్ధి రేటు, ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంక్, సోషల్ వెల్ఫేర్ డెవలప్మెంట్, కామర్స్ ఇండెక్స్, నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్, బడికి దూరమైన బాలికలు, మైనర్లకు పెండ్లి, నవజాత శిశు మరణాలు, చిన్నారుల్లో పెరుగుదల లోపం, పారిశుద్ధ్యలేమి, మానవాభివృద్ధి సూచీ ఇలా ప్రతీ అంశంలో తెలంగాణ కంటే గుజరాత్ ఎంతో వెనుకబడి ఉన్నది. దీంతో గుజరాత్ మాడల్ ఫేక్ అని తేలిపోయింది.