Minister Harish Rao | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఆపత్కాలంలో రోగిని వేగంగా పెద్ద దవాఖానకు తరలించేందుకు వీలుగా త్వరలో రాష్ట్రంలో ఎయిర్ అంబులెన్స్లు ప్రవేశపెట్టనున్నట్టు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు, మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఎవరికైనా గుండెపోటు లేదా ప్రమాదాల్లో గాయపడటం తదితర అత్యవసర పరిస్థితి తలెత్తితే హెలికాప్టర్ ద్వారా దవాఖానకు తరలించేందుకు వీలు కలుగుతుందని వెల్లడించారు. ఇన్నేండ్లు సంపన్నులకే పరిమితమైన ఈ సేవలు సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని పేదలకు కూడా అందుబాటులోకి రానున్నట్టు పేర్కొన్నారు.
2014 నుంచి ఇప్పటి వరకు వైద్యారోగ్యశాఖ పనితీరును వివరిస్తూ రూపొందించిన పదేండ్ల ప్రగతి నివేదికను మంత్రి హరీశ్రావు సోమవారం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. దీనితోపాటు 310 మంది ఫార్మసిస్టులకు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైద్యారోగ్యరంగంలో 60 ఏండ్లలో కనిపించని అభివృద్ధి సీఎం కేసీఆర్ పాలనలో దశాబ్దకాలంలోనే జరిగిందని తెలిపారు. ఫార్మసిస్టులుగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతూ వైద్యారోగ్యశాఖ కుటుంబంలో చేరుతున్న 310 మందికి స్వాగతం పలికారు. వీరిలో డీపీహెచ్ పరిధిలో 105 మంది, టీవీవీపీ పరిధిలో 135 మంది, డీఎంఈ పరిధిలో 70 మంది ఉన్నారని వివరించారు. ఔషధాలను సమకూర్చడం, డాక్లర్లు సూచించినట్టు రోగులకు అందించడంలో ఫార్మసిస్టులది కీలకపాత్ర అని పేర్కొన్నారు. రోగులకు చిరునవ్వుతో మందులు అందిస్తే వారు ఎంతో సంతోషిస్తారని చెప్పారు.
తొమ్మిదేండ్లలోనే తెలంగాణ వైద్యారోగ్యరంగం దేశానికే రోల్మాడల్గా నిలిచిందని మంత్రి హరీశ్రావు తెలిపారు. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ సీఎం కేసీఆరేనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ పనితీరుకు ‘ప్రగతి నివేదిక’ ఒక నిదర్శనమని వెల్లడించారు. ప్రజలకు మంచి సేవలు అందిస్తూ, అనేక మంది ప్రాణాలు కాపాడేందుకు కృషిచేస్తున్న వైద్యారోగ్యశాఖలోని ప్రతి ఒకరికీ అభినందనలు తెలియజేశారు. 2014లో నీతిఆయోగ్ ఆరోగ్య సూచీలో 11వ స్థానంలో ఉంటే, ఇప్పుడు 3వ ర్యాంకుకు చేరుకున్నామని చెప్పారు. వైద్య సిబ్బంది సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. మొదటి స్థానానికి చేరడానికి అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సరారు దవాఖానకు అనుకునే స్థాయి నుంచి నేడు పోదాం బిడ్డో సరారు దవాఖానకే అనేలా మార్పు జరిగిందని వెల్లడించారు.
మరో ఏడాదిలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో పడకల సంఖ్య 50 వేలకు చేరనున్నదని వివరించారు. ‘గ్రామ స్థాయిలో పల్లె దవాఖానలు, పట్టణాల్లో బస్తీ దవాఖానలు, మండల స్థాయిలో పీహెచ్సీలు, నియోజకవర్గ స్థాయిలో 100 పడకల దవాఖానలు, జిల్లాకో మెడికల్ కాలేజీ, జిల్లాకో నర్సింగ్ కాలేజీ, జిల్లాకో పారా మెడికల్ కాలేజీ, వరంగల్లో హెల్త్ సిటీ, హైదరాబాద్ నలువైపులా సూపర్ స్పెషాలిటీ టిమ్స్ దవాఖానలు, 4 వేల పడకలుగా నిమ్స్ విస్తరణ, సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్లు’ ఇలా ప్రతి దశలోనూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని అన్నారు. ఎలాంటి హెల్త్ ఎమర్జెన్సీని అయినా తట్టుకోవడానికి వైద్యారోగ్యరంగం సన్నద్ధంగా ఉన్నదని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది రూ.12,364 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నామని తెలిపారు. ప్రభుత్వం ఒకొకరి వైద్యంపై చేస్తున్న తలసరి ఖర్చు రూ.3,532 అని వివరించారు. ఔషధాల అందుబాటు, పంపిణీ ప్రక్రియలో తెలంగాణ గతంలో మూడో స్థానంలో ఉండేదని, త్వరలో రెండో స్థానంలోకి చేరబోతున్నట్టు చెప్పారు. కొత్తగా ఫార్మసిస్టులు చేరికతో మరింత బలోపేతం అవుతుందని, మొదటి స్థానానికి చేరుకుంటుందని ఆశిస్తున్నామని అన్నారు.
అవయవ మార్పిడుల్లో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉన్నదని కేంద్రం ఇటీవలే చెప్పిందని మంత్రి హరీశ్ వెల్లడించారు. ఇందుకు కారణమైన వైద్యులు, సిబ్బందిని అభినందించారు. ముఖ్యంగా నిమ్స్ దవాఖానలో 6 నెలల్లోనే 100 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్లు పూర్తయ్యాయని గుర్తు చేశారు. గాంధీ దవాఖానలో 8వ అంతస్థులో ప్రత్యేకంగా అవయవ మార్పిడి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ప్రతి నెల సగటున 8 మందికి బోన్మారో ట్రాన్స్ప్లాంట్ జరుగుతున్నదని తెలిపారు. ప్రైవేట్ దవాఖానల్లో రూ.15-35 లక్షల వరకు ఖర్చయ్యే ఈ శస్త్ర చికిత్సలను ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా చేస్తున్నదని వెల్లడించారు. రాబోయే రోజుల్లో దేశ, విదేశాల నుంచి వచ్చి మన ప్రభుత్వ దవాఖానల్లో అవయవ మార్పిడులు చేసుకునే పరిస్థితులు రాబోతున్నాయని అన్నారు. 119 నియోజకవర్గాల్లో ఒకో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు.
నిమ్స్లో సోమవారం నుంచి వారంపాటు బ్రిటన్ వైద్యుల బృందం ఉచితంగా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా బ్రిటన్ బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ అరుణ్ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ప్రగతి నివేదికను పీహెచ్సీ స్థాయి నుంచి అన్ని స్థాయిల దవాఖానల్లో ప్రదర్శించాలని అధికారులకు సూచించారు. ‘మా రిపోర్టును చూసి ఆశీర్వదించండి. మరింత ఉత్సాహంతో సేవలు అందిస్తాం. మీ దీవెనలు ఉన్నంతకాలం వైద్యారోగ్యశాఖను మరింత బలోపేతం చేస్తాం’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ సుధాకర్రావు, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీపీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, డ్రగ్స్ కంట్రోల్ డీజీపీ కమలాసన్రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఎంఎన్జే హాస్పిటల్ డైరెక్టర్ జయలత, సీఎం ఓఎస్డీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
వైద్య సదుపాయాలు కల్పించటంతోపాటు వైద్య సిబ్బంది నియామకంపైనా దృష్టిపెట్టామని మంత్రి తెలిపారు. 9 ఏండ్లలో వైద్య శాఖలో 22,600 పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. మరో 7,291 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని వెల్లడించారు. ఇందులో 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల పరీక్ష పూర్తయ్యిందని, వారం, పది రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్ల నియామకం తుది దశకు చేరిందని, 1,931 ఎంపీహెచ్ఏ (ఫిమేల్) పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నట్టు వివరించారు. ఇవి కూడా పూర్తయితే పదేండ్లలోనే 30 వేల ఉద్యోగాలు వైద్యశాఖలో ఇచ్చిన ఘనత సీఎం కేసిఆర్కు దక్కుతుందని పేర్కొన్నారు.