బేగంపేట్, ఆగస్టు 6: ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం సక్రమంగా జరిగేందుకు బీఎల్ఓలు, సిబ్బంది సంఖ్యను మరింతగా పెంచాలని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ గడువు ఈ నెల 10న ముగియనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ వెస్ట్ మారేడ్పల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని బూత్ లెవల్ ఏజెంట్లు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ…పార్టీ శ్రేణులు, బూత్ లెవల్ ఏజెంట్లు, ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరూ తమ పూర్తి వివరాలతో కూడిన ఎన్యుమరేటర్ ఫారాన్ని సమర్పించేలా అవగాహన కల్పించాలన్నారు. కొందరు ఓటర్లకు ఫారాలు అందలేదని, మరి కొందరు ఫారాలు తీసుకున్న సమర్పించలేదని ఆయన పేర్కొన్నారు. ఫారాలు అందని వారికి అందించేలా చర్యలు తీసుకోవాలని , ఫారం సమర్పించని వారు సమర్పించేలా చూడాలని చెప్పారు.
గడువు లోగా వివరాలు సమర్పించని వారి ఓట్లు తొలగిస్తామని ఎన్నికల అధికారులు స్పష్టంగా చెబుతున్నారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా పోకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు శ్రీహరి, పవన్కుమార్గౌడ్, శేషుకుమారి, అత్తెల్లి శ్రీనివాస్గౌడ్, కొలన్ బాల్రెడ్డి, లక్ష్మీపతి, వెంకటేశంరాజు,ఆకుల హరికృష్ణ, శ్రీనివాస్గౌడ్, ఏసూరి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.