హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగంగా నిర్వహిస్తున్నదని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సోమవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 65.2 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్టు తెలిపారు. మరో 3.45 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే కేంద్రం ఇచ్చిన టార్గెట్ పూర్తవుతుందని, అదనంగా ధాన్యం వచ్చే అవకాశం ఉన్నదని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన నగదును ఎప్పటికప్పుడు రైతులకు అందిస్తున్నామని, ఇప్పటివరకు రూ.10,394 కోట్లను వారి ఖాతాల్లో జమచేసినట్టు వివరించారు. మరోవైపు సీఎంఆర్ మిల్లింగ్లోనూ వేగం పెంచినట్టు పేర్కొన్నారు. సీఎంఆర్ తీసుకొనేందుకు ఎఫ్సీఐ సిద్ధంగా ఉండాలని అన్నారు. సమావేశంలో పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.