Minister KTR | మన పథకాలను కేంద్రం కాపీకొడుతున్నదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతు బంధు.. పీఎం కిసాన్ అయిందని, మిషన్ భగీరథ.. హర్ ఘర్ జల్ అయిందని, మిషన్ కాకతీయ.. అమృత్ సరోవర్ అయిందని, షాదీ ముబారక్ .. షాదీషగున్ అయిందని, మన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్.. పీఎం మిత్ర అయిందని, టీఎస్ ఐపాస్.. సింగల్ విండో అయిందని వివరించారు.
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ప్రజలకు కావాల్సింది డబుల్ ఇంజిన్ సర్కారు కాదని, గ్రోత్ ఇంజిన్ సర్కార్ అని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్గా తీర్చిదిద్దామంటూ గణాంకాలతోసహా వివరించారు. నేడు విమర్శలు చేస్తున్న విపక్ష పార్టీలు మళ్లీ ఇండ్లకే పరిమితం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. అంశాలవారీగా విపక్ష పార్టీలపై విమర్శల జడివాన కురిపించిన మంత్రి కేటీఆర్.. తాను చెప్పినవి తప్పని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. పల్లె ప్రగతి, పట్ట ప్రగతి, హైదరాబాద్ అభివృద్ధిపై శనివారం అసెంబ్లీలో జరిగిన లఘు చర్చకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. అనర్గళ ప్రసంగంతో విపక్ష నేతల నోళ్లు మూయించారు.
నాడు ముంబై.. నేడు హైదరాబాద్ నెవర్ స్లీప్స్
కరెంటు కోతలతో ఇబ్బందిపడిన హైదరాబాద్ ఇప్పుడు నిరంతర విద్యుత్తుతో వెలుగులీనుతున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. ఒకప్పుడు ముంబై నెవర్ స్లీప్స్ అనేవారని, నేడు హైదరాబాద్ నెవర్ స్లీప్స్ అనే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ఒకప్పుడు పవర్ హాలీడేలు ఉండగా, నేడు పవర్ ఫుల్డేలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్కు కంటెంట్ లేదని, వారుంటే ప్రజలకు కరెంటు లేదన్నారు. ఐదు దశాబ్దాలుగా కంటెంట్ లేని నాయకులు ఉండబట్టే ప్రజలకు కరెంటు ఇవ్వలేక పోయారని విమర్శించారు. ఇప్పుడు మూడు గంటల కరెంటు చాలంటున్నారని, మూడు గంటల కరెంటు కావాల్నో, మూడు పంటలంటున్న కేసీఆర్ కావాల్నో, మతం మంటలంటున్న బీజేపీ కావాల్నో ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. పారిస్, బొగోటా, మెక్సికోను తలదన్ని గ్రీన్సిటీ అవార్డును హైదరాబాద్ చేజిక్కించుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. కష్టపడి నిర్మించిన బ్రాండ్ ఇమేజ్ ఛిద్రమైతదని, హైదరాబాద్ దెబ్బతింటే తెలంగాణ ఆగమైతదని ప్రజలు ఆలోచించాలన్నారు.
జగన్కు, చంద్రబాబుకు అర్థమైంది కానీ..
ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో వంద ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉండే ది. ఇవాళ తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆం ధ్రాలో 50 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి వచ్చిందని పక్కరాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు పేర్కొన్న మాట వాస్తవం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో పాలకులకు రైతులపై ప్రేమ ఉందని, అందుకే వార్లు మోటార్లకు మీటర్లు పెట్టలేదని, మెడపైన కత్తిపెట్టినా కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకోవడంలేదని చంద్రబాబునాయుడు చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ.. కేటీఆర్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మంచిని మంచిగా గుర్తించినందుకు ధన్యవాదాలన్నారు. పక్కరాష్ట్రం వాళ్లకు అర్థమైనా మన రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు అర్థం కాలేదని పేర్కొన్నారు. దిశ సంఘటన అనంతరం ప్రభు త్వం స్పందించిన తీరుపై నిండు శాసనసభలో ‘ఐ సెల్యూట్ కేసీఆర్’ అని పక్క రాష్ట్ర సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారని గుర్తుచేస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
అన్నీ ఫ్రీ అన్న బండి షెడ్డుకు పోయింది
హైదరాబాద్ అభివృద్ధిపై కేటీఆర్ మాట్లాడుతూ.. మెట్రో టెండర్ అయిపోయిందని, 31కిలోమీటర్లమేర త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. రోడ్ల విస్తరణకు కేంద్రం స్థలం ఇవ్వడం లేదని, కంటోన్మెంట్ ఏరియాలో 96 ఎకరాలు కావాలని ఐదుగురు కేంద్రమంత్రులను కలిసినట్లు గుర్తుచేశారు. హైదరాబాద్ ఎన్నికలప్పుడు ఒకాయన బండిపోతే బండి ఫ్రీ, ఏది పోతే అది ఫ్రీ అన్నారని, ఇప్పుడు ఆ బండే షెడ్డుకు పోయిందని ఎద్దేవా చేశారు. మూసీ ప్రాజక్టు, ఓల్డ్సిటీ మెట్రోను త్వరలో పూర్తిచేస్తామన్నారు. 24గంటల నీరు అందించడం తమ కల అని, అది కూడా చేసి చూపిస్తామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నగర మంచినీటి అవసరాలను తీర్చేందుకు రూ. 2215 కోట్లతో సుంకిశాల ప్రాజక్టు చేపట్టి పూర్తిచేస్తున్నట్టు తెలిపారు. 50 ఏండ్ల భవిష్యత్తు అవసరాలు తీర్చేలా 60 టీఎంసీలతో దీనికి రూపకల్పన చేసినట్లు వివరించారు.
మాది గల్లీ పార్టీయే..
తమది గల్లీ పార్టీయే అని, తమ నాయకుడు సింగిల్ విండో ఛైర్మన్ నుంచి సీఎం అయ్యారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వారిది ఢిల్లీపార్టీ అని, ప్రభుత్వంలో, పార్టీలో ఒక్క నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ వెళ్లాల్సిందేనని ఎద్దేవా చేశారు. నిర్ణయం తీసుకునే ధైర్యం, సాహసం, తెగువ, తెలివి, స్వేచ్ఛ, స్వతంత్రం, వెన్నుముక ఇవన్నీ ఉన్న నాయకుడు తమకు ఉన్నాడని నొక్కి చెప్పారు. కేసీఆర్ నిర్ణయాలు తీసుకోవడంలో మెరుపువేగమని, అమలుచేయడంలో రాకెట్ స్పీడని పేర్కొన్నారు.
బాత్రూముకు పోవాలన్నా చలో ఢిల్లీ
కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒక మాట ఇవ్వాలన్నా చలో.. ఢిల్లీ, మ్యానిఫెస్టో తయారుచేయాలన్నా.. చలో ఢిల్లీ, బీఫాంలు తెచ్చుకోవాలన్నా.. చలో ఢిల్లీ, ఇచ్చిన హామీ అమలు చేయాలన్నా.. చలో ఢిల్లీ, ఒక పథకం ప్రవేశపెట్టాలన్నా, ఫైల్పై సంతకం చేయాలన్నా, ఒక సమస్య తీర్చాలన్నా, రోడ్డు వేయాలన్నా, రోడ్డుపై కుస్తీలు పట్టుకుంటే తీర్చాలన్నా చలో ఢిల్లీ, చివరికి బాత్రూమ్కి పోవాలన్నా చలో ఢిల్లీ అనక తప్పదని కేటీఆర్ చమత్కరించారు. గెలిచివాళ్లు అసెంబ్లీలో ఉంటే ఓడినవాళ్లు గెలిచినవాళ్ల ఫ్యూచర్ను డిసైడ్ చేస్తారని విమర్శించారు. తమ బాసులు తెలంగాణలో గల్లీల్లో ఉన్నారని పేర్కొన్నారు. వీళ్లు (కాంగ్రెస్, బీజేపీ నాయకులు) ఢిల్లీ పెద్దలు వదిలిన బాణాలని, తెలంగాణ గల్లీల నుంచి ప్రజలు తయారుచేసిన బ్రహ్మాస్త్రం కేసీఆర్ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
అనుమానపు పక్షులు ఇండ్లకే పరిమితం
మెట్రోని 400 కిలోమీటర్లకు విస్తరిస్తామంటే కొందరు అనుమానపు పక్షులకు సందేహాలున్నాయని విపక్ష నేతలను ఉద్దేశించి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్కు సంకల్ప బలం, దైవ ఆశీర్వాదం, ప్రజల మద్దతు పుష్కలంగా ఉన్నాయని, అనుమానపు పక్షులు హాయిగా ఇండ్లలో పడుకోవచ్చని సూచించారు. 100శాతం మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, అన్ని ప్రాజక్టులూ పూర్తిచేస్తామని, ప్రజలకు ఇచ్చిన ప్రతిమాటను బరాబర్ నిలబెట్టుకుంటామని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. కాళేశ్వ రం మొదలుపెట్టినప్పుడు ఇలాగే అన్నారని, మిషన్ భగీరథ, కాకతీయ, సచివాలయ నిర్మాణం, అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు తదితర సందర్భాల్లోనూ ఇలాగే సందేహాలు వ్యక్తంచేశారని, అప్పుడు అనుమాన పడినవాళ్లే ఇప్పుడు చీకట్లో వెళ్లి అంబేద్కర్ విగ్రహం వద్ద సెల్ఫీలు దిగి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. శ్రీధర్బాబు కూడా ఈ మధ్య వెళ్లినట్లు తెలిసిందని పేర్కొన్నారు. రాష్ట్రం వస్తదన్ననాడు కూడా అనుమానపడ్డారని, కేసీఆర్ తెలంగాణ తెచ్చారన్నారు. అది తమ కమిట్మెంట్ అని, కంటెంట్ లేని కాంగ్రెస్కు, కమిట్మెంట్ ఉన్న కేసీఆర్కు పోలిక లేదని స్పష్టం చేశారు.
కేసీఆర్ లాంటి విజనరీ లీడర్లు కావాలి
రోమ్ వజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే.. తెలంగాణ భూతల స్వర్గం అయిందని తాను చెప్పడంలేదని, ఇంకా సమస్యలు ఉన్నాయన్నారు. అమెరికాలో సైతం సమస్యలు ఉన్నాయని, ఇంకా ఉంటాయని తెలిపారు. హైదరాబాద్ అత్యధిక ఐటీ ఉద్యోగాలను సృష్టించి బెంగళూరును వెనక్కి నెట్టిందని పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ ఉన్న రాష్ర్టాలు ఢక్కామొక్కీలు తింటుంటే తొమ్మిదేండ్లలోనే తెలంగాణ దేశంలోనే తలెత్తుకొని సగర్వంగా నిలిచిందని, అందుకు కారణం హైదరాబాద్ అని పేర్కొన్నారు. ప్రగతిపథంలో పరుగులు పెట్టాలంటే కావాల్సింది డబుల్ ఇంజిన్లు కాదని, హైదరాబాద్ లాంటి గ్రోత్ ఇంజిన్లు, కేసీఆర్లాంటి విజనరీ లీడర్లు అని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చేవారు అంతా తామే ఇస్తున్నామని చెప్పుకుంటున్నారని, కానీ తెలంగాణ నుంచి పన్నుల రూపంలో రూపాయి కడుతుంటే, తిరిగి వస్తున్నది మాత్రం 45 పైసలు మాత్రమేనని తెలిపారు.
హైదరాబాద్ను నేనే కట్టానన్న ‘పెద్దాయన కథ’
‘ఒక పెద్దాయన హైదరాబాద్ను నేనే కట్టినా అని చెప్పేవాడు. ఒకసారి ఆయన ఎర్రగడ్డ దవాఖానలో ఏదో ప్రారంభోత్సవానికి వెళ్లి అక్కడ రోగులతో మాట్లాడుతుంటే ఒక రోగి అటుగా వస్తున్నాడు. అప్పుడు సదరు పెద్దాయన ఆయనను బాగున్నవా అని పలకరించాడు. ఆ తరువాత నన్ను గుర్తుపట్టినవా అని అడిగాడు. అతను గుర్తు పట్టలేదని చెప్పాడు. అరే హైదరాబాద్ నేనే కట్టాను, నన్ను గుర్తుపట్టకపోవడం ఏమిటని ప్రశ్నించాడు సదరు పెద్దాయన. దీనికి ఆ రోగి స్పందిస్తూ.. నేను కూడా నిన్నమొన్నటివరకు వైజాగ్కు సముద్రం నేనే తెచ్చానని చెప్పుకున్నా. తొందరగ మందులేసుకో నీకు కూడా జల్ది నయమైతది అని చెప్పాడు.’ ఇలా చాలామంది చాలా చిత్రమైన మాటలు మాట్లాడుతారని, 450 ఏండ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ను నేనంటే నేను నిర్మించానని చెప్తారని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే గతంలో కూడా కొన్ని పనులు జరిగాయని, కాంగ్రెస్ హయాంలో ఓఆర్ఆర్ చేపడితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పూర్తి చేశామని, మెట్రో ప్రారంభిస్తే తాము పూర్తిచేశామని గుర్తు చేశారు. అలాగే రాజశేఖర్రెడ్డి ఆరోగ్యశ్రీ తెచ్చారని తమ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారని, ఉన్నదున్నట్టు చెప్పే దమ్ము తమకు ఉందని, మీకు లేదని కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి పేర్కొన్నారు. కాంగ్రెస్లో పనిచేసినవారు కొందరు మంచోళ్లేనని, రాజశేఖర్రెడ్డి కాంగ్రెస్ ఇప్పుడు ఆంధ్రాకు వెళ్లిపోయిందని, ఇక్కడి కాంగ్రెస్ గురించి తాను చెప్పబోనని పేర్కొన్నారు.