High Court | హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం 2016లో ప్రారంభిస్తే 2024లో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేస్తారా? ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగితే ఇంతకాలం ఏం చేస్తున్నారు? అంటూ రాష్ట్ర హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. తాము ప్రశ్నలు సంధించడం మొదలుపెడితే జవాబు చెప్పలేరని ఘాటుగా వ్యాఖ్యానించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పోలీసుస్టేషన్లో మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై నమోదైన కేసును సీబీఐకి బదలాయించాలని,ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యానికి నంబర్ కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్కుమార్ ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ను ఉద్దేశించి ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది టీ నరేందర్రావు స్పందిస్తూ అక్రమాలు జరిగాయని చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు, ఇదేం పబ్లిసిటీ పిటిషన్ కాదు అని వ్యాఖ్యానించింది.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్రెడ్డి వాదిస్తూ, ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిందని, ప్రాథమిక నివేదిక ఆధారంగా ఇప్పటికే కొంతమంది అధికారులను పదవుల నుంచి తొలగించిందని చెప్పారు. తుది నివేదిక అందిన తర్వాత పూర్తిస్థాయిలో చర్యలు ఉంటాయని తెలిపారు. ఎంక్వయిరీ యాక్ట్ ప్రకారం జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నదని చెప్పారు. 2023 అక్టోబరు 24, 25 తేదీల్లో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ప్రాజెక్టును సందర్శించి ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించిందని చెప్పారు. మేడిగడ్డ అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్, నిర్మాణం, ఆపరేషన్స్ నిర్వహణపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఫిబ్రవరి 13న నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీకి లేఖ రాసినట్లు వివరించారు. ఈ మేరకు అరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయని చెప్పారు. అడ్వకేట్ జనరల్ రాతపూర్వకంగా వివరాలను పరిశీలించిన హైకోర్టు.. ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టినందున తదుపరి విచారణను నాలుగు నెలలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.