హైదరాబాద్ : అనాథ ఆశ్రమాలు, కొవిడ్ వల్ల అనాథలైన వారి జీవన స్థితిగతులను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు వారికి ప్రభుత్వమే తల్లిదండ్రిగా మారి సంరక్షణ చూసుకోనున్నట్లు క్యాబినేట్ సబ్ కమిటీ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో అనాథల స్థితిగతుల అధ్యయనంపై ఏర్పాటైన రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ శనివారం సమావేశమైంది. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన ఈ భేటీకి మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.
అనాథల సంక్షేమాన్ని మానవీయ కోణంలో ఈ ప్రభుత్వం చూస్తుందని, ఎంత ఖర్చు అయినా భరిస్తుందని, ఈ సబ్ కమిటీ ద్వారా ప్రతిపాదించే పాలసీ దేశం మొత్తం గర్వించే విధంగా, ఇతర రాష్రాలన్నీ అనుసరించేలా సూచిస్తామని భేటీ సందర్భంగా కమిటీ ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అనేక రంగాల్లో దేశానికి ఆదర్శవంతంగా ఉందని, అనాథల కోసం అమలు చేసే విధానం సైతం వీటన్నింటిని మించి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు విహార్లు, హోమ్స్, ఆశ్రమాలను పటిష్టంగా తయారుచేస్తూ, ప్రైవేట్ ఆధ్వర్యంలో సేవా దృక్పథంతో గొప్పగా నిర్వహిస్తున్న అనాథ ఆశ్రమాలను ప్రోత్సహించే విధంగా ఈ కమిటీ తన సూచనలు సమర్పిస్తుందన్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో సభ్యులు పరిశీలించి అభిప్రాయాలు క్రోడీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశానికి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్ కన్వీనర్ గా వ్యవహరించారు. సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.