హైదరాబాద్: వచ్చే విద్యాసంవత్సరానికిగానూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మూడు జతల యూనిఫాంలను ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రెండు జతల యూనిఫాంలు ఇస్తుండగా, తాజాగా మూడు జతలు ఇవ్వాలన్న దిశగా ఆలోచిస్తున్నారు. గురుకులాల్లోని విద్యార్థులకు మూడు జతల యూనిఫాంలు ఇస్తుండగా, పాఠశాలల్లోని విద్యార్థులకు సైతం మూడు జతల యూనిఫాంలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోన్నట్లుగా తెలుస్తున్నది.
ప్రతీ ఏటా రాష్ట్రంలోని విద్యార్థులకు యూనిఫాంలను అందజేస్తున్నారు. ఇలా ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు, ఎయిడెడ్ పాఠశాల్లోని 22 లక్షల విద్యార్థులకు యూనిఫాంలను పంపిణీ చేస్తున్నారు. ఒక్కో యూనిఫాంకు రూ. 200 చొప్పున రూ. 100 కోట్లకు పైగా నిధులు వెచ్చిస్తున్నారు. టెస్కో ద్వారా టెరికాటన్ వస్త్రాన్ని తెప్పించి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ద్వారా కుట్టించి, విద్యార్థులకు అందజేస్తున్నారు. ఈ ఏడాది సైతం టెస్కో ద్వారానే వస్త్రాన్ని సేకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.