హైదరాబాద్ : దేశ, విదేశాల్లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన గిరిజన గురుకులాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఆర్ధిక సాయం చేస్తోందని, ల్యాప్ టాప్లను ఇస్తోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. గిరిజన గురుకులాల విద్యార్థులకు ఐఐటి, ఎన్ఐటీల్లో ట్యూషన్ ఫీజ్ మినహాయింపు ఉందని, అదనంగా స్కాలర్ షిప్ కూడా వస్తుందన్నారు. నీట్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీట్లు పొందుతున్నారని, వీరికి ప్రోత్సాహకంగా ఆర్ధిక సాయం అందిస్తున్నామన్నారు. విదేశాల్లో చదివితే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం కింద రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు.
ఐఐటీలో సీట్లు సాధించిన విద్యార్థులకు రూ. 50 వేలు, ల్యాప్ టాప్ అందిస్తున్నామన్నారు. ఎన్ఐటీ/ఐఐఐటీ సంస్థల్లో సీటు సాధించిన వారికి రూ. 40 వేలు, ల్యాప్ టాప్ ఇస్తున్నామని, ఎంబీబీఎస్లో సీటు సాధించిన విద్యార్థులకు రూ. 50 వేలు, బీడీఎస్ లో అడ్మిషన్ పొందిన వారికి రూ. 40 వేలు ప్రోత్సాహకంగా ఇస్తున్నామని చెప్పారు.
2015 నుంచి 2020 వరకు ఐఐటీల్లో 183 మంది, ఎన్ఐటీలో 200 మంది, ఐఐఐటిలో 59 మంది, ఎంబీబీఎస్ లో 67 మంది, బీడీఎస్లో ముగ్గురు విద్యార్థులకు ఈ ప్రోత్సాహకాలు అందించామన్నారు. కరోనా వల్ల విద్యాలయాలు మూతపడి ఉన్నప్పటికీ గురుకుల విద్యార్థులు ఈ సంవత్సరం కూడా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు సాధించారని, వారికి కూడా ఈ ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.
ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు పొందిన విద్యార్థులు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి(డిటిడిఓ) లకు తమ వివరాలు అందజేయాలని, తెలంగాణ ఈపాస్ వెబ్ సైట్ https://telanganaepass.cgg.gov.in లో తమ వివరాలు నమోదు చేసుకుంటే వారికి ఉపకారవేతనాలు కూడా అందుతాయని తెలిపారు.